Sidhu: నవ్జ్యోత్సింగ్ సిద్ధూ. ఒకప్పుడు క్రికెటర్. ఇప్పుడు పొలిటిషియన్. మధ్యలో కామెడీమెన్. పంజాబ్ కాంగ్రెస్లో కీలకంగా ఎదిగారు. ఓ దశలో సీఎం పదవికీ పోటీ పడ్డారు. కానీ, జస్ట్ మిస్ అయ్యారు. అలా రాజకీయంగా ఫుల్ లైమ్లైట్లో ఉన్న సమయంలోనే.. అనూహ్యంగా కోర్టు తీర్పుతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 34 ఏళ్ల క్రితం నాటి ఆ కేసులో.. సుమారు ఏడాది పాటు జైల్లో మగ్గారు. అయితే, సత్ప్రవర్తన కారణంగా సిద్ధూకి బంపర్ ఆఫర్ తగిలింది.
48 రోజులు ముందుగానే జైల్ నుంచి రిలీజ్ అయ్యారు సిద్ధూ. జైలు గోడల మధ్య నుంచి బయటకు వస్తూనే.. రాజకీయ ప్రకంపణలు రేపారు. ‘దేశంలో నియంతృత్వం వచ్చినప్పుడల్లా ఒక విప్లవం కూడా వచ్చింది. ఈసారి ఆ విప్లవం పేరు రాహుల్ గాంధీ’ అంటూ మరోసారి తాను కరుడుగట్టిన కాంగ్రెస్ వాదినని నిరూపించుకున్నారు.
పాటియాలా కారాగారం నుంచి విడుదల అయిన సిద్ధూకు.. కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు. జైలు ముందు నిలబడి.. మీడియాతో రాజకీయ ప్రసంగం కూడా చేశారు. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం అంటూ ఏమీ లేదన్నారు. పంజాబ్లో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. పంజాబ్ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తే.. వారే బలహీనంగా మారతారని హెచ్చరించారు. రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేస్తారని అన్నారు.
సిద్దూపై కేసు ఏంటంటే..
34 ఏళ్ల క్రితం ఘటన. 1988 డిసెంబరు 27న పాటియాలాలో పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. సిద్ధూ దాడి చేయడంతో, 65 ఏళ్ల గుర్నామ్ సింగ్ తీవ్రంగా గాయపడి చనిపోయాడు. పలు కోర్టుల్లో విచారణ అనంతరం.. చివరికి సుప్రీంకోర్టు గతేడాది మే నెలలో.. సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించింది. 10 నెలలుగా పటియాలా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సిద్ధూ.. సత్ప్రవర్తనతో ఏడాది కాకముందే రిలీజ్ అయ్యారు. సిద్ధూ రాకతో.. పంజాబ్ కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం వచ్చేనా?