Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని పరువునష్టం కేసులు వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మోదీ అనే ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. లేటెస్ట్గా రాహుల్ పై హరిద్వార్ కోర్టులో పరువునష్టం పిటిషన్ దాఖలైంది. ఈ సారి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై చేసిన విమర్శలకు గాను పరువునష్టం కేసు నమోదైంది.
ఈ ఏడాది జనవరి 9న అంబాలలో జరిగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ RSS కార్యకర్తలను 21వ శతాబ్దపు కౌరవులు అన్నారు. ఈ యాత్ర ముగిసిన మూడు నెలల తర్వాత ఇప్పుడు కమల్ బదూరియా అనే RSS కార్యకర్త హరిద్వార్ కోర్టులో పరువునష్టం పిటిషన్ వేశాడు. ఈ నెల 12న ఈ పిటిషన్ విచారణకు రానుంది.
మరోవైపు అదే రోజున మరో పరువునష్టం కేసులో విచారణకు హాజరుకావాలని పాట్నా కోర్టు రాహుల్ గాంధీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ వేశారు. మోదీ అనే ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుజరాత్ కోర్టు రాహుల్ గాంధీకి ఇటీవల రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
మహారాష్ట్రలోని థానేలో కూడా రాహుల్ గాంధీపై ఒక పరువు నష్టం కేసు నడుస్తోంది. మహాత్మా గాంధీ హత్యకు RSS కారణమని 2014లో రాహుల్ గాంధీ ఒక బహిరంగ సభలో ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై RSS కార్యకర్త ఒకరు థానే కోర్టులో పిటిషన్ వేశారు.
ఇలా రాహుల్ గాంధీ పరువునష్టం కేసుల ఉచ్చులో చిక్కుకుంటూ.. రాజకీయంగా ఇరుకున పడుతున్నారు. సునాయాసంగా ప్రత్యర్థులకు టార్గెట్గా మారుతున్నారు.