BJP: కేస్ 1: అఖండ భారతమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక సంచలనాలు. కశ్మీర్కు స్వయంప్రతిపత్తి రద్దు అయింది. త్రిబుల్ తలాక్పై నిషేధం విధించింది. ఉమ్మడి పౌరస్మృతి కోసం గట్టిగా ట్రై చేస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. కొవిడ్కు యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ తయారుచేసి వందకు పైగా దేశాలకు సరఫరా చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్పై సర్జికల్ స్ట్రైక్ చేసింది. చైనాకు గట్టి సవాల్ విసురుతోంది. ఉక్రెయిన్-రష్యా వార్లో తటస్థంగా ఉండి అగ్రరాజ్యాలకు షాక్ ఇచ్చింది. రష్యా నుంచి భారీగా చమురు కొనడం మరో వ్యూహాత్మకం పరిణామం. ఇలా గతంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ పటంలో భారత్ తన ప్రత్యేకతను, ఉనికిని బలంగా చాటుకుంటోంది.
కేస్ 2: రెండేళ్లు జైలు శిక్ష పడటంతో ఎంపీగా రాహుల్గాంధీపై అనర్హత వేటు పడింది. ఇదేదో ప్రపంచ సమస్య అన్నట్టు.. అమెరికా వెంటనే స్పందించింది. జర్మనీ సైతం వాయిస్ వినిపించింది. జర్మనీ రియాక్షన్కు కాంగ్రెస్ కీలక నేత ధన్యవాదాలు చెప్పడం.. హస్తం పార్టీ తీరును బీజేపీ తీవ్రంగా తప్పుబట్టడం.. ఇది మన దేశసార్వభౌమత్వంలో విదేశాలు జోక్యం చేసుకోవడమే అనే చర్చ వినిపిస్తోంది.
పై రెండు కేస్ 1, కేస్ 2 ల మధ్య సంబంధం ఏంటనే డౌట్ రావొచ్చు. దానికీ దీనికీ లింక్ ఏంటి అనుకోవచ్చు. పైపైన చూస్తే అర్థం కాకపోవచ్చు గానీ.. వీటన్నిటికీ ఇంటర్లింక్ ఉందని అంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. కేస్ 1 పరిణామాలను చూస్తే.. భారత్ సుపర్ పవర్గా ఎదుగుతోందని తెలుస్తోంది. దేశీయంగా, ప్రపంచ వ్యాప్తంగా తన మార్క్ చాటుకుంటోంది. రష్యా అంటే ఏమాత్రం పడని అమెరికా, జర్మనీల మాటనే కాదంది. ఇండియా ఇంతగా బలపడితే..? మరో ప్రపంచ శక్తిగా ఎదిగితే..? అది ప్రస్తుత అగ్రరాజ్యాల పెత్తనానికి సవాలేగా..? అందుకే భారత్ను ఏ విధంగా కార్నర్ చేయాలా? అని ఎదురుచూస్తుంటాయి వెస్ట్రన్ కంట్రీస్.
క్రిస్టియన్ ఆధిపత్యం ఉండే విదేశాలకు భారత్ అంటే కంటగింపు.. బీజేపీ అంటే మండిపాటు.. అని అంటారు. గతంలో గుజరాత్ అల్లర్లను బూచీగా చూపించి అప్పటి సీఎం మోదీపై ఏళ్ల తరబడి అమెరికా రాకుండా నిషేధం విధించింది అగ్రరాజ్యం. మోదీ ప్రధాని అయ్యాకే ఆ బ్యాన్ ఎత్తేసింది. రెడ్ కార్పెట్ పరిచి మనోడికి వెల్కమ్ చెప్పింది. గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కి సపోర్ట్ చేసి.. ఎన్నారైల ఓట్లతో ఆ దేశ ఎన్నికలనూ శాసించే సత్తా ఇండియాకు ఉందనే మెసేజ్ ఇచ్చింది.
ఇలా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. అంతర్జాతీయంగా సత్తా చాటుతుండటం.. అమెరికా మాటకు జీహుజూర్ అనకపోవడం.. ఆ దేశానికి మింగుడుపడని అంశమే. అందుకే, ఇండియాలో జరిగే ప్రతీ చిన్న విషయాన్ని.. బూతద్దంలో చూస్తూ.. భారత్ను బద్నామ్ చేసేందుకు బాగా ఆసక్తి చూపాయని అంటున్నారు.
బీజేపీ ఎంతగా బలపడితే.. హిందుత్వం అంతగా స్ట్రాంగ్ అవుతుందని కొన్నిదేశాలు కలవరపడుతున్నాయి. అఖండ భారతం ఆవిష్కృతమైతే ఇక ఇండియాకు తిరుగుండకపోవచ్చు. ఇప్పటికే కొవిడ్ వ్యాక్సిన్ రూపంలో అనేక పేద దేశాలకు మనదేశం పెద్దన్నగా నిలిచింది. ఆసియాలో బలం పుంజుకోవడం, ఆఫ్రికా దేశాలు అభిమానిస్తుండటం.. పడమటి దేశాలకు మింగుడుపడటం లేనట్టుంది.
ఎంపీగా రాహుల్గాంధీపై వేటు వేయడంపై అమెరికా, జర్మనీలు స్పందించాల్సిన అవసరమే లేదు. రాహుల్ అప్పీల్కు వెళ్లేందుకు ఇంకా గడువు కూడా ఉంది. ఈలోగా ఇండియాలో ఏదో జరిగిపోతోందని ప్రపంచదేశాలను భ్రమపెట్టడానికే.. ఆ రెండు దేశాలు స్పందించడం మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడేనని కేంద్రం తప్పుబడుతోంది.
అమెరికా స్పందన ఇదే..
రాహుల్ గాంధీ ఎపిసోడ్ పై అమెరికా రియాక్ట్ అయ్యింది. ఏ ప్రజాస్వామ్యానికైనా చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత మూల స్తంభాలుగా తెలిపింది. భారత కోర్టుల్లో రాహుల్ గాంధీ కేసును గమనిస్తున్నామని వెల్లడించింది. భావ ప్రకటనా స్వేచ్ఛతోపాటు ప్రజాస్వామ్య విలువలపై భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిబద్ధతతో ఉన్నామని ప్రకటించింది. ప్రజాస్వామ్య సూత్రాలు, మానవ హక్కుల పరిరక్షణ, భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాముఖ్యతను నిత్యం హైలైట్ చేస్తూనే ఉంటామని అమెరికా విదేశాంగశాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు. అంతకుముందు, భారత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ‘రో ఖన్నా’ మరింత ఘాటుగా స్పందించారు. ఎంపీగా రాహుల్ గాంధీపై వేటు వేయడం గాంధీ సిద్ధాంతాలకు, భారతదేశ విలువలకు తీవ్ర ద్రోహం చేయడమే అవుతుందని ట్వీట్ చేశారు. తన తాతయ్య ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపింది దీని కోసం కాదని స్పష్టంచేశారు. భారత ప్రజాస్వామ్యం కోసం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అధికారం మీకు ఉందంటూ ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు. రాహుల్ అనర్హత గురించి న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనాన్ని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. (రో ఖన్నా తాత అమర్నాథ్ విద్యాలంకార్.. భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. లాలా లజపతి రాయ్తో కలిసి పనిచేశారు. కొన్నేళ్లపాటు జైలు జీవితం గడిపారు.)
జర్మనీ రియాక్షన్ ఇదే..
“భారత్లో రాహుల్ గాంధీకి జైలు శిక్ష.. ఆ తీర్పు కారణంగా ఆయన లోక్సభ సభ్యత్వం రద్దవ్వడం వంటి అంశాలను మేం గమనిస్తున్నాం. ఈ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయి. తీర్పుపై ఆయన అప్పీల్ చేసుకోవచ్చు” అని జర్మనీ స్పందించింది. దీనిపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ థ్యాంక్స్ చెప్పడంతో.. ఈ ఇష్యూ మరింత రచ్చగా మారింది. కేంద్రమంత్రులు కాంగ్రెస్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.