Bhadrachalam: భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. శుక్రవారం సీతారామచంద్ర స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. సామూహిక పారాయణం, హోమాలు చేశారు. దేశ నలువైపుల నుంచి పుణ్య నదుల నుంచి సేకరించిన పుష్కర తీర్థాలతో స్వామివారికి అభిషేకం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఆలయంలో ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీతాయారమ్మలను దర్శించుకున్నారు. పట్టాభిషేక మహోత్సవం గురించి ఆలయ అర్చకులు చేసిన ప్రవచనం భక్తులను అలరించింది.