Manisha Koirala : బాంబే, ఒకే ఒక్కడు, ఇండియన్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకున్న నేపాలీ బ్యూటీ మనీషా కొయిరాలా. అయితే తమిళంలో ఆమె చేసిన బాబా సినిమా తర్వాత అవకాశాలు లేకుండా పోయాయి. రీసెంట్ ఇంటర్వ్యూలో మనీషా కొయిరాలా బాబా సినిమా గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. బాబా సినిమాలో రజినీకాంత్గారితో కలిసి నటించాను. ఆయనతో కలిసి నటించటం బాగా అనిపించింది. సాధారణంగా ఆయన సినిమాలు పరాజయం కావు. కానీ ఎందుకనో బాబా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించలేదు. బాబా డిజాస్టర్తో దక్షిణాదిలో నా కెరీర్ ముగిసిపోయిందనే చెప్పాలి. అయితే 20 ఏళ్ల తర్వాత బాబాను రీ రిలీజ్ చేయగా మంచి ఆదరణ దక్కింది’’ అని అన్నారు మనీషా కొయిరాలా.
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం బాబా. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రజనీకాంత్ కథ, స్క్రీన్ ప్లే అందించటంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఎంతలా డిజాస్టర్ అయ్యిదంటే.. రజనీకాంత్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తీసుకున్న మొత్తాన్ని వెనక్కి ఇచ్చేశారు. ఇది ఆధ్యాత్మిక కోణంలో సాగుతూ రాజకీయ నాయకులను విమర్శించే కథాంశంతో తెరకెక్కింది. భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ సినిమా పరాజయం రజినీకాంత్ను బాగా డీలా పడేలా చేసింది. కొన్నాళ్లు పాటు ఆయన సినిమాలు చేయలేదు. కాస్త గ్యాప్ తీసుకుని ఆయన చేసిన చంద్రముఖితో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు సూపర్ స్టార్.
దేవుడిపై సినిమా చూస్తే జనాలు ఆదరించలేదు. అయితే ఆ వెంటనే దెయ్యంపై సినిమా చేస్తే మాత్రం ఆదరించారని రజినీకాంత్ ఓ వేదికపై కూడా తన సినిమాపై తనే కామెంట్స్ వేసుకున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో ముందుగా జైలర్ సినిమా ఆగస్ట్ 11న రిలీజ్ అవుతుంది.