IPL : క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ సందడి షురూ కాబోతోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. గతేడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ లు మరింత ఉత్కంఠగా జరిగేందుకు బీసీసీఐ ఆట నిబంధనల్లో ఆసక్తికర మార్పులు తీసుకొచ్చింది. తాజా సీజన్ కు తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తో మ్యాచ్ ఫలితంపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది చర్చ నడుస్తోంది. ఈ నిబంధన ఇప్పటికే ఆస్ట్రేలియా బిగ్బాష్ లీగ్లో అమలు అవుతోంది. ఈ నిబంధనతో ఆల్రౌండర్ల ప్రాధాన్యత తగ్గుతుందనే వాదన ఉంది.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అమలు ఇలా..
ప్రతి జట్టు మ్యాచ్కు ముందు 11 మంది ఆటగాళ్లతోపాటు నలుగురు సబ్స్టిట్యూట్లను ప్రకటించాలి. ఆ నలుగురిలో ఒకరిని ఇంపాక్ట్ ఆటగాడిగా ఆడించేందుకు అవకాశం ఉంటుంది. తుది జట్టులో విదేశీ ఆటగాళ్లు నలుగురు ఉంటే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్గా భారత క్రికెటర్నే ఎంపిక చేసుకోవాలి. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఇంపాక్ట్ ప్లేయర్ను ఆడించుకునే వీలుంది.
పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అనుకుంటే.. బ్యాటర్ స్థానంలో స్పిన్నర్ను ఇంపాక్ట్ ఆటగాడిగా ఆడించుకోవచ్చు. ఒకవేళ ఛేదనలో అదనపు బ్యాటర్ అవసరం ఉంది అనుకుంటే.. అప్పుడు ఓ బౌలర్ స్థానంలో బ్యాటర్ను తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఇంపాక్ట్ ఆటగాడి కోసం మైదానం వీడిన క్రికెటర్ మళ్లీ మ్యాచ్లో కొనసాగే అవకాశం ఉండదు.
ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు లేదా ఓవర్ ముగిశాక లేదా వికెట్ పడ్డాక లేదా ఓ బ్యాటర్ రిటైరయ్యాకే ఇంపాక్ట్ ఆటగాడు మైదానంలోకి రావాలి. అప్పటికే రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలర్ స్థానంలో వచ్చే ఇంపాక్ట్ ఆటగాడు తన పూర్తి కోటా 4 ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ఆటగాడు కెప్టెన్గా మాత్రం బాధ్యతలు చేపట్టకూడదు. ఇంపాక్ట్ ఫ్లేయర్ ఉన్నా ఓ జట్టులో గరిష్టంగా 11 మంది మాత్రమే బ్యాటింగ్ చేయాలి.