Tamilnadu : తమిళనాడులో మరో వివాదం రాజుకుంది. ప్యాకెట్లపై పెరుగు పేరును మార్చాలన్న FSSAI నిర్ణయంపై తమిళులు మండిపడుతున్నారు. స్వయంగా సీఎం స్టాలిన్ రంగంలోకి దిగి ఈ నిర్ణయంపై మండిపడ్డారు.
వివాదమేంటి..?
భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ .. FSSAI ఇటీవల తమిళనాడు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కు పెరుగు పేరుపై ఆదేశాలు జారీ చేసింది. పెరుగు ప్యాకెట్లపై ఆంగ్లంలో ఉన్న కర్డ్ , తమిళంలో ఉన్న ‘తయిర్ ’ పేర్లను తొలగించి.. ‘దహీ’ అని హిందీలోకి మార్చాలని ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే నెయ్యి, చీజ్ లాంటి డైరీ ఉత్పత్తుల పేర్లను ఇలాగే మార్చాలని FSSAI ఆదేశించింది. కర్ణాటకకు కూడా ఇలాంటి ఉత్తర్వులే పంపినట్లు సమాచారం.
స్టాలిన్ ఫైర్..
FSSAI ఇచ్చిన ఆదేశాలపై తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము దహీ అనే పేరును వినియోగించబోమని తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సమాఖ్య స్పష్టం చేసింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆ ఆదేశాలపై మండిపడ్డారు. హిందీని బలవంతంగా రుద్దాలనే వారి పట్టుదల మరింత పెరుగుతోందని విమర్శించారు. చివరకు పెరుగు ప్యాకెట్పైనా పేరును మార్చేసి హిందీలో రాయమని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతృభాషలపై ఇలాంటి నిర్లక్ష్యం పనికిరాదని మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వారిని దక్షిణాది శాశ్వతంగా బహిష్కరిస్తుందని స్టాలిన్ హెచ్చరించారు.
బీజేపీ రాష్ట్రశాఖ వ్యతిరేకం..
తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా పెరుగు పేరు మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రాంతీయ భాషాలను ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ విధానాలకు ఈ నిర్ణయం విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వెనక్కి తగ్గిన FSSAI..
వివాదం మరింత ముదరకముందే FSSAI వెనక్కి తగ్గింది.పెరుగు పేరు మార్పుపై తొలుత ఇచ్చిన ఆదేశాలను సవరించింది.పెరుగు ప్యాకెట్లపై ఆంగ్ల పేరుతోపాటు స్థానిక భాషల పేర్లను బ్రాకెట్లలో పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. మొత్తంమీద తమిళుల ఆగ్రహంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ వెనక్కి తగ్గాల్సివచ్చింది. తమిళులా మజాకా..!