Car Accident: దేవుడికి మొక్కుకున్నారు. గుడికి వెళ్లి మొక్కు తీర్చుకున్నారు. అప్పటికే రాత్రి అయింది. ఆ కుటుంబం అంతా కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. అంతలోనే ఊహించని ప్రమాదం. కారుపై ఒక్కసారిగా ఢమాల్ అంటూ.. పెద్ద వస్తువేదో పడింది. క్షణకాలంలోపే కారు మొత్తం చితికిపోయింది. కారులో ఉన్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అసలేం జరిగిందంటే…
ఆ కారుపై పొక్లెయినర్ పడింది. అవును, నిజమే పొక్లెయినరే. అలా ఎలా పడిందంటే.. ఓ ట్రాక్టర్లో పొక్లెయినర్ను తరలిస్తున్నారు. ఏడుగురు కుటుంబ సభ్యులు కారులో వెళ్తున్నారు. ఆ ట్రాక్టర్, కారు ఒక దగ్గరికి వచ్చే సరికి.. ఉన్నట్టుండి ట్రాక్టర్ మీది ఉన్న పొక్లెయినర్ పక్కకు ఒరిగి కారుపై పడింది. దెబ్బకు కారు నుజ్జునుజ్జు అయింది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో మంగళవారం రాత్రి జరిగిందీ దుర్ఘటన.
కారులో ముప్పారపు రాజేశ్వర్ (45), జ్యోతి (42), రమ (41)లు అక్కడిక్కడే మృతి చెందారు. మిగిలిన వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. చితికిపోయిన కారు నుంచి మృతదేహాలను, క్షతగాత్రులను బయటికి తీసేందుకు 108 సిబ్బంది గంటకుపైగా శ్రమించారు. ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు.
ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పొక్లెయిన్ ఎలా పడింది? జారి పడిందా? లేదంటే కారు, ట్రాక్టర్ ఢీకొట్టాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.