Vishaka: విశాఖ దంపతులు మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. మంగళవారం కన్పించకుండా పోయిన వరప్రసాద్ దంపతుల్లో ఒకరు విగతజీవిగా కన్పించారు. కొప్పాక ఏలూరు కాలువలో వరప్రసాద్ మృతదేహం లభ్యమైంది.
విశాఖ గాజువాకకు చెందిన దంపతుల జంట తాము ఆత్మహత్య చేసుకోబోతున్నామంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే చనిపోతున్నట్లుగా ఆ వీడియోలో తెలిపారు. తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.
సెల్ఫీ వీడియో తర్వాత ఇద్దరి ఫోన్లు స్విఛాప్ అయ్యాయి. వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాలువ దగ్గర చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, మొబైల్ ఉన్నట్టు గుర్తించారు.
ఆ జంట.. కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు భావించి.. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు. కానీ, ఎన్నిగంటలు గడిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. చీకటి పడటంతో సెర్చ్ ఆపరేషన్ తాత్కాలికంగా ఆపేశారు. బుధవారం ఉదయమే మళ్లీ గాలింపు మొదలుపెట్టగా.. వరప్రసాద్ మృతదేహం లభించింది. అతని భార్య మీరా డెడ్ బాడీ కోసం గాలింపు కొనసాగుతోంది.