Viveka Murder Case: వివేక హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెంత కాలం విచారిస్తారని.. అవసరమైతే విచారణ అధికారిని మార్చేయండని.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. కట్ చేస్తే, ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
గతంలోనూ ఇదే విధంగా హైకోర్టును ఆశ్రయించారు అవినాశ్రెడ్డి. అయితే, అరెస్ట్ చేయవద్దని తాము ఆదేశాలు ఇవ్వలేమంటూ పిటిషన్ తిరస్కరించింది న్యాయస్థానం. మళ్లీ మరోసారి ముందస్తు బెయిల్ కోసం అవినాశ్రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ఏంటి? సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత సీబీఐ దూకుడు పెంచుతుందనే భయమా? సీబీఐ విచారణలో వేగం పెరిగితే అవినాశ్రెడ్డికి ఏంటి? తనను అరెస్ట్ చేస్తారనే బెదురా? అయితే కావొచ్చు.
వివేకా హత్య కేసులో ఇప్పటికే వైఎస్ అవినాశ్రెడ్డిని పలుమార్లు ప్రశ్నించింది సీబీఐ. విచారణకు పిలిచిన ప్రతీసారి ఏడెనిమిది గంటల పాటు వివరాలు సేకరించారు. అయినా, వివేకా కేసులో అవినాశ్రెడ్డి పాత్రపై ఇంకా స్పష్టమైన నిర్థారణకు సీబీఐ రాలేకపోతోందని తెలుస్తోంది. అవినాశ్ తనపై వచ్చిన ఆరోపణల కంటే కూడా.. వివేక రాసిన లేఖ, వివేక కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సీబీఐ భావిస్తోందని అంటున్నారు. అందుకే, అవినాశ్రెడ్డిని అరెస్ట్ చేసి సమగ్రంగా విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ భయంతోనే మరోసారి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది.