Amaravati: అమరావతిపై ఏపీ సర్కారు ముందడుగు వేయడం లేదు. రాజధాని రైతులు పట్టు వీడటం లేదు. మూడు రాజధానులు వద్దు.. అమరావతినే ముద్దు.. అంటూ స్థానికులు హైకోర్టుకు వెళ్లారు. అమరావతి నిర్మాణం పూర్తి చేయాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. తాజాగా అక్కడా చుక్కెదురైంది.
అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా.. స్టే ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. కేసు విచారణ వీలైనంత త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేయగా.. సుప్రీంకోర్టు సున్నితంగా తిరస్కరించింది. ఈ కేసులో అనేక మంది ప్రతివాదులు ఉన్నారని.. వారందరి వాదనలు వినాల్సి ఉందని తెలిపింది. తాము ఇతర కేసులు కూడా విచారించాల్సి ఉందంటూ ఒకింత ఘాటుగానే స్పందించింది.
కనీసం వచ్చే నెలలోనైనా విచారణ జరపాలని ఏపీ తరఫు న్యాయవాదులు అభ్యర్థించగా.. కేసును జులై 11కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.