`
Ramaiah:- ఏటా శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణోత్సవంతో కళకళలాడే భద్రాద్రి రాముడు ఈ సంవత్సరం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకంతో మరింత అనుగ్రహించనున్నాడు. దేవతలందరిలో పట్టాభిషేక వైభవం ఒక్క శ్రీరాముడికే ఉంది. ప్రతి ఏటా శ్రీరామనవమి మర్నాడు దశమి రోజు పట్టాభిషేకం నిర్వహిస్తారు. గతంలో భద్రాచలంలో 60 ఏళ్లకి ఒకసారి మహాసామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించే సంప్రదాయం ఉంది.
1987 ప్రభవ నామ సంవత్సరంలో శ్రీరామనవమి సందర్భంగా ఈ క్రతువును నిర్వహించారు. అరవై ఏళ్లకి ఒకసారి జరిగే ఈ అద్భుత మహోత్సవాన్ని చూసేందుకు 1987లో భద్రాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఈ మహోజ్జ్వల సన్నివేశాన్ని మనిషి జీవితంలో ఒక్కసారి మాత్రమే చూడగలిగే వీలు ఉండేది. అయితే, ఈ అవకాశం అందరికీ దక్కాలనే ఉద్దేశంతో 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించాలని ఆలయ నిర్వాహకులు భావించారు.
ఈ క్రమంలో 2011లో మొదటి పుష్కర పట్టాభిషేకానికి నాంది పలికారు. మళ్లీ 12 సంవత్సరాలకు ఈ ఏడాది పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి భద్రాచలం ముస్తాబవుతున్నది. ఇప్పటికే స్వామివారికి నిత్యం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పారాయణాలు, జప, హోమాలు నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా గురువారం స్వామివారి కల్యాణాన్ని కన్నులపండువగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరుసటి రోజైన శుక్రవారం పుష్కర పట్టాభిషేకం జరుగుతుంది. సమస్త నదీ జలాలతో స్వామివారిని అభిషేకిస్తారు. రామచంద్రుడికి రాజలాంఛనాలతో పట్టాభిషేకం చేస్తారు. ఈ మహా క్రతువులో పాల్గొని పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకంతో వెలిగిపోతున్న రాముడిని దర్శించుకోవడం భక్తులు జన్మకో అదృష్టంగా భావిస్తారు.
దేవుడ్ని కోరికలు కోరుకోకూడదా…?
for more updates follow this link:-Bigtv