Kadapa: పులివెందులలో కాల్పుల కలకలం చెలరేగింది. పట్టపగలు, BSNL ఆఫీసు ముందు.. ఇద్దరిపై కాల్పులు జరిపాడు నిందితుడు. దిలీప్, మస్తాన్ బాషాలకు బుల్లెట్లు దిగాయి. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దిలీప్ చనిపోయాడు. చాతి, కడుపులో బుల్లెట్లు దిగడంతో మృతిచెందాడు.
కాల్పులు జరిపింది భరత్ కుమార్ యాదవ్ అని తెలుస్తోంది. కొంతకాలంగా దిలీప్తో భరత్కు ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయి. అదును చూసి దిలీప్పై తుపాకీతో కాల్పులు జరిపాడు భరత్ కుమార్ యాదవ్. ఆ సమయంలో దిలీప్తో పాటు ఉన్న బాషాపైనా ఫైరింగ్ చేశాడు.
ఇక, భరత్ కుమార్ యాదవ్.. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ఓసారి సీబీఐ అతన్ని విచారించింది. వివేకానందరెడ్డికి సునీల్ యాదవ్ను పరిచయం చేసింది భరత్ కుమారే. ఆ దిశగా సీబీఐ ప్రశ్నించింది. ఆ భరత్ కుమార్ యాదవే ఇప్పుడు ఇలా పులివెందులలో గన్తో రెచ్చిపోయాడు. తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒకరు చనిపోవడం, మరొకరికి తీవ్రగాయాలు కావడం కలకలం రేపుతోంది. సీఎం జగన్ సొంత ఇలాఖా కావడంతో.. మరింత సంచలనంగా మారింది. నిందితుడు భరత్ కుమార్ యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.