Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ జాయింట్ డైరక్టర్ లేఖ రాశారు. విచారణ సమయంలో కవిత అందించిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు సిద్దమయ్యామని లేఖలో పేర్కొన్నారు. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావాలని కోరారు. లేదంటే తన ప్రతినిధిని పంపాలని సూచించారు. దీంతో కవిత తరఫున ఈడీ ముందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ వెళ్లారని సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 11న ఎమ్మెల్సీ కవిత ఫోన్ను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈ నెల 21న కవిత మరో 9 ఫోన్లను ఈడీకి అందజేశారు. అయితే సీజ్ చేసిన ఫోన్లను ఓపెన్ చేసేందుకు సాక్షిగా కవిత గానీ, ఆమె ప్రతినిధి గానీ రావాలని ఈడీ అధికారులు కోరారు. ఈ మేరకు లీగల్ అడ్వైజర్ సోమా భారత్కు ఆథరైజేషన్ ఇచ్చి తన ప్రతినిధిగా ఈడీ కార్యాలయానికి విచారణకు కవిత పంపారని తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటి వరకు మూడుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. మార్చి 11, 20, 21 తేదీల్లో ఈడీ అధికారులు ఆమె ప్రశ్నించారు. కీలక సమాచారం రాబట్టారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలన రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ అయ్యారు. కవితను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగినా .. మూడుసార్లు విచారించి పంపించారు.