YSRCP : అది 1994వ సంవత్సరం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. టీడీపీ ప్రతిపక్ష పార్టీ. అదే ఏడాది ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రచారంలో ఎక్కడికెళ్లినా కూడా లక్ష్మీపార్వతి ఉండేవారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వంలో ఎలాంటి పదవి చేపట్టకపోయినా పాలనా వ్యవహారాల్లో లక్ష్మీపార్వతి పాత్ర ఎక్కవ అయ్యిందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే 1995 ఆగస్టులో టీడీపీలో సంక్షోభం తలెత్తింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాటి నుంచి చంద్రబాబు చేతిలోనే టీడీపీ ఉంది. ఇది చరిత్ర.
2019 ఎన్నికల సమయానికి జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలు కైవసం చేసుకుని అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టారు. అప్పటి నుంచి పాలనా వ్యవహారాలు పూర్తిగా ఆయన చేతిలోకి వెళ్లిపోయాయనే విమర్శ ఉంది. ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా ప్రభుత్వంలో సజ్జల పెత్తనం సాగిస్తున్నారని ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఏ పనికైనా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఆయననే సంప్రదించాలని, మంత్రులు నేరుగా సీఎంను కలుసుకునే స్వేచ్ఛ కూడా లేదని టాక్. ఇక ఎమ్మెల్యేల సంగతి సరే సరి. ముఖ్యమంత్రి సంగతి అటు ఉంచితే కనీసం సజ్జల కూడా వారికి అపాయింట్ మెంట్ ఇవ్వరనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి లాంటి సీనియర్ నేతలు పార్టీపై, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వారిద్దరితోపాటు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ అధిష్టానమే పార్టీ నుంచి తాజాగా సస్పెండ్ చేసింది. వారంతా ఎమ్మెల్సీలో ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారని వైసీపీ చెబుతోంది.
వైసీపీలో ప్రస్తుత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 1995లో టీడీపీలో తలెత్తిన సంక్షోభాన్ని గుర్తు చేశారు. నాడు టీడీపీలో లక్ష్మీపార్వతి వ్యవహరించినట్లుగానే నేడు వైసీపీలో సజ్జల వ్యవహరిస్తున్నారని అన్నారు. పరిస్థితి చేయి దాటకముందే ఆయనను పక్కన పెట్టకపోతే ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఇంకా పెరుగుతుందని తెలిపారు. ఇప్పటికీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ప్రేమిస్తున్నారని చెప్పారు. కానీ వారిని సజ్జల రామకృష్ణారెడ్డికి రిపోర్టు చేయాలనడం సరికాదని అభిప్రాయపడ్డారు. గతంలో టీడీపీలో తలెత్తిన సంక్షోభం లాంటిది వైసీపీలో తలెత్తకుండా చూసుకోవాలని జగన్ కు రఘురామకృష్ణరాజు సూచించారు. వైసీపీ కోసం మేకపాటి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. జగన్ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆయనకు మద్దతుగా మేకపాటి చంద్రశేఖర్రెడ్డి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారని అలాంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సిగ్గుచేటని రఘురామ మండిపడ్డారు.
మరోవైపు వైసీపీలో సంతృప్తి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని టీడీపీ అంటోంది. ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. వారి విషయం తెలిస్తే సీఎం జగన్ కు పక్షవాతం వస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందా..? వైసీపీలో నిజంగానే అసమ్మతి కుంపటి రాజుకుంటోందా..?