DS: కాదేదీ రాజకీయాలకు అనర్హం. ఈ పాత కొటేషన్ ప్రస్తుత రాజకీయాలకు మరింతగా అప్లై అవుతుంది. ఏ సంఘటన జరిగినా దాన్ని రాజకీయం చేస్తూనే ఉంటాయి పార్టీలు. ఘటనలే కాదు, మనుషులనూ పొలిటికల్ గేమ్లో పావులుగా వాడేస్తున్నారు. కాంగ్రెస్లో డి.శ్రీనివాస్ ఎపిసోడ్.. ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఆదివారం జాయినింగ్.. సోమవారం రిజైన్తో ధర్మపురి రాజకీయం ఆసక్తికరంగా మారింది.
డి.శ్రీనివాస్ అలియాస్ డీఎస్. గతంలో పీసీసీ ప్రెసిడెంట్. వైఎస్సార్తో కలిసి కాంగ్రెస్ను ఉరకలెత్తించారు. హస్తం పార్టీలో కింగ్ పిన్గా ఉన్నారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీగా, కారు పార్టీకి అంటరాని నేతగా ఉన్నారు. డీఎస్ కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ ఎంపీగా దూసుకుపోతున్నారు. తండ్రి బీఆర్ఎస్కు దూరమవడంతో.. ఆయన బీజేపీలో చేరుతారని అనుకున్నారు.
ధర్మపురి బ్రదర్స్కు అసలేమాత్రం పడదు. అన్నదమ్ముల వార్ ఓ రేంజ్లో సాగుతోంది. అందుకే, తమ్ముడు బీజేపీలో ఉంటే.. అన్న కాంగ్రెస్లో చేరారు. అర్వింద్కు రాజకీయంగా సవాల్ విసిరారు సంజయ్. కొడుకుల పొలిటికల్ వార్లో తండ్రి నలిగిపోతున్నారు.
రాజకీయ జీవితమంతా కాంగ్రెస్తోనే గడిపిన డీఎస్.. బీజేపీలోకి వెళ్లలేకపోయారు. మరో కుమారుడు సంజయ్ను మాత్రం కాంగ్రెస్లో చేర్చారు. ఆ కార్యక్రమానికి తానూ హాజరై.. కొడుకును ఆశీర్వదించాలని భావించారు. కానీ… తానొకటి తలిస్తే, కాంగ్రెస్ నేతలు మరొకటి చేశారు. సంజయ్ చేరిక సందర్భంగా గాంధీభవన్కు వచ్చిన డీఎస్కు కాంగ్రెస్ కండువా కప్పేసి పార్టీలో చేరినట్టు ప్రకటించేశారు హస్తం నేతలంతా కలిసి. ఈ వార్త మీడియాలో బ్రేకింగ్ న్యూస్గా వచ్చేలా హడావుడి చేశారు. కట్ చేస్తే.. ఆ మర్నాడే తాను అసలు కాంగ్రెస్లో చేరలేదని, అదంతా అబద్దమంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు డి.శ్రీనివాస్. పనిలో పనిగా ఒకవేళ తాను పార్టీలో చేరానని మీరు అనుకుంటే.. ఇదిగో నా రాజీనామా అంటూ లేఖ కూడా విడుదల చేశారు. డీఎస్ సతీమణి రిలీజ్ చేసిన ఆ వీడియో అండ్ లెటర్.. ఇప్పుడు మీడియాకు మరోసారి బ్రేకింగ్ న్యూస్.
డి.శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి అసలేమాత్రం బాలేదు. వయోభారం, పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆయన ఎప్పటినుంచో యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏ పార్టీలో చేరినా పెద్దగా ఉపయోగం ఏమీ ఉండకపోవచ్చు. నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కాంగ్రెస్లో చేర్చుకుని ఖుషీ చేసుకోవాల్సిన కాంగ్రెస్ నేతలు.. కాస్త ఓవరాక్షన్ చేసి.. డీఎస్ను సైతం పార్టీలో కలిపేసుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలంతా తనను సన్మానిస్తున్నారని అనుకున్నారు కాబోలు డీఎస్. ఇంటికెళ్లాక కానీ ఆయనకు అసలు జరిగిందేంటో తెలీలేదు. ఆ టెన్షన్కి నైట్ ఫిట్స్ కూడా వచ్చాయని డీఎస్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ‘చేతులు జోడించి దండం పెడుతున్నా.. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను ప్రశాంతంగా బతకనీయండి’ అంటూ డీఎస్ సతీమణి విజయలక్ష్మి లేఖలో కోరారు.
అక్కడితో అయిపోలేదు ధర్మపురి రాజకీయం. తన తండ్రికి ప్రాణహాని ఉందంటూ సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. డీఎస్ కాంగ్రెస్లో చేరిన మాట వాస్తవమేనని.. అయితే అర్వింద్.. తండ్రిని బ్లాక్మెయిల్ చేసి రాజీనామా లేఖపై సంతకం చేయించారని అనడంతో ధర్మపురి ఫ్యామిటీ పాలిటిక్స్ మరింత హాట్గా మారాయి.