RamCharan: అయ్యప్ప మాల. దక్షిణభారతంలో లక్షలాది మంది అయ్యప్ప దీక్ష చేస్తుంటారు. 48 రోజుల పాటు ఎంతో నియమ, నిబంధనలతో నిష్ఠగా ఉంటారు. ఆ అయ్యప్ప స్వామి కృపకు పాత్రులవుతారు. సామాన్యులు ఇలా దీక్ష చేయడం కామనే కానీ.. సెలబ్రిటీస్లో చాలా తక్కువ. సినీ ఇండస్ట్రీ నుంచి జేసుదాసు, శరత్బాబు, నిర్మాత సురేశ్బాబు లాంటి వాళ్లు అయ్యప్ప భక్తులుగా ఉండేవారు. ఆ తర్వాత టాలీవుడ్లో మాలధారులు పెద్దగా కనిపించరు. అలాంటిది మెగా పవర్ స్టార్ మాత్రం ఏటేటా అయ్యప్ప దీక్ష చేపడుతుండటం మామూలు విషయం కానేకాదు.
రామ్చరణ్ స్థాయి.. స్టార్ డమ్ ఉన్న హీరో లగ్జరీ లైఫ్ స్టైల్ ను వదిలేసి.. ఆడంబరాలకు దూరంగా.. సింపుల్గా ఉంటుండటం విశేషం. అలా ఒకటి రెండు కాదు.. ఏకంగా 15 ఏళ్లుగా రామ్చరణ్ అయ్యప్ప మాల వేసుకుంటున్నారు. ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సమయంలో అమెరికా వెళ్లినప్పుడు సైతం ఆయన మాలలోనే ఉన్నారు. కాళ్లకు చెప్పులు లేకుండా.. అమెరికా నేలపై అడుగుపెట్టిన విజువల్స్ తెగ వైరల్ అయ్యాయి. ఇంతకీ రామ్చరణ్కు అయ్యప్ప దీక్షపై ఎందుకంత గురి కుదిరింది? ఆయన రెగ్యులర్గా మాల వేసుకుంటుండటం వెనుక రీజన్ ఏంటి?
పలు సందర్భాల్లో రామ్చరణ్, చిరంజీవిలు అయ్యప్ప మాలపై క్లారిటీ ఇచ్చారు. తండ్రి నుంచే చరణ్కు దైవచింతన అలవరింది. చిరంజీవి.. హన్మంతుని భక్తుడని అందరికీ తెలిసిందే. పలుమార్లు అయ్యప్ప మాల కూడా వేసుకున్నారు మెగాస్టార్. రామ్చరణ్ సైతం తండ్రిలానే అంజనీపుత్రుడిని ఆరాధిస్తుంటారు. అయ్యప్ప దీక్షను నిష్ఠగా చేస్తుంటారు. ఇటీవల అమెరికా పర్యటనలో అక్కడో టీవీ షోలో మాట్లాడిన చరణ్.. అయ్యప్ప దీక్ష గురించి అమెరికన్లకు గొప్పగా వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…
“15 సంవత్సరాల నుంచి నేను దీక్ష చేపడుతున్నా. దైవ చింతనే ప్రధానంగా జీవించేందుకు మేం అలా చేస్తుంటాం. 48 రోజుల వ్యవధి ఉండే దీక్షలో ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తాం. మాంసాహారం ముట్టుకోం. నేలపైనే పడుకోవాలి. చన్నీళ్ల స్నానమే చేయాలి. మహిళలను తాకకూడదు. ఎలాంటి లగ్జరీ లేకుండా బతకాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా మారేందుకు దీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది”.. అంటూ అమెరికా మీడియాతో అన్నారు రామ్చరణ్. దీక్షాకాలం ముగియలేదనే కారణంతో.. బ్లాక్ డ్రెస్తో, కాలికి చెప్పులు లేకుండానే అమెరికా వెళ్లారు మెగా పవర్ స్టార్. ఎంత కమిటెడ్గా దీక్ష చేస్తారనేదానికి ఇదే ఎగ్జాంపుల్.
చిరంజీవి సైతం చరణ్ దీక్షపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “చరణ్ తరచూ మాలధారణలో కనిపిస్తుంటాడు. ప్రశాంతత లభిస్తుందని, క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్దేశంతోనే దీక్ష చేపడుతుంటాడు”.. అని చిరంజీవి అన్నారు. కారణమేదైనా.. 15 ఏళ్లుగా రామ్చరణ్ లాంటి సెలబ్రిటీ.. అయ్పప్ప మాల వేసుకుంటూ.. భక్తితో నిరాడంబరంగా ఉంటుండటం అభినందించాల్సిన విషయమే.