Sitaramulu : వందే సీతారామం.. వందే లోకాభిరామం.. ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్న హైందవ ధర్మంలో మరే ఇతర దేవతల కల్యాణానికి దక్కని వైభవం, మహత్తు కేవలం సీతారామ కల్యాణానికే మాత్రమే దక్కాయి. ఈ లోకోత్తర కల్యాణాన్ని మాత్రమే సీతారామ శాంతి కల్యాణం అని పిలుస్తారు.
వాస్తవానికి సీతారామ కల్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ, మహతాం జన్మనక్షత్రే వివాహం అంటుంది ఆగమశాస్త్రం. మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి నాడు ఆ నక్షత్రంలో కల్యాణం చేయాలనేది శాస్త్ర వచనం . త్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. ఆ పర్వదినాన్ని శ్రీరామనవమిగా చేసుకుంటారు. ఈ సందర్భంగా ఊరూవాడా సీతారాముల కల్యాణం జరుపుతారు.
ఏ దేవుడికి దక్కని ఘనత సీతారామ కల్యాణానికే ఉంది. కారణం సీతారాములిద్దరూ సాధారణ స్త్రీపురుషులు కాదు. వారిద్దరూ యజ్ఞఫలితంగా ఆవిర్భవించిన పుణ్యమూర్తులు. తమ వంశం తరించడానికి పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు చేసిన యాగఫలితంగా శ్రీరామచంద్రమూర్తి జన్మిస్తే, యజ్ఞ నిర్వహణలో భాగంగా యాగశాల కోసం భూమిని దున్నుతున్న జనక మహారాజుకు నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞప్రసాదం సీతాదేవి. అలాంటి యజ్ఞ ఫలితంగా జన్మించిన సీతారాములు ఒకటైన కల్యాణ మహోత్సవం లోకకల్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడింది.
శ్రీ రామచంద్రుడిని ఎన్నో రకాలుగా పూజించవచ్చు. శ్రీరామ అష్టోత్తర పారాయణం జపించ వచ్చు. రామరక్షా స్తోత్రం, ఆపదుద్ధారక స్తోత్రం వంటి రామస్తోత్రాలు శ్రీరామనవమి సందర్భంగాపారాయణం చేయాలి. శ్రీరామయ నమః అనే మంత్రం జపం చేయవచ్చు. అయితే మంత్రోపదేశం ఉన్నవాళ్లు మాత్రమే, గురువు ఆదేశానుసారం జపించాల్సి ఉంటుంది.
శ్రీరామ నామాన్ని సాధ్యమైనన్ని పర్యాయాలు జపించొచ్చు. హరేరామ హరేరామ రామరామ హరేహరే, హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే మంత్రాన్ని యథాశక్తి చేసుకోవచ్చు.నిత్య దేవతార్చనలో భాగంగా షోడశ ఉపచార విధులతో స్వామివారి పూజ చేయవచ్చు. రామకోటి రాయడం, రామ భజన చేయడం కూడా అర్చనలో భాగమే!