Elon Musk: ట్విట్టర్ ఉద్యోగులకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాడు. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియక ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే ట్విట్టర్లోని 50 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాడు. తొలగింపుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు మస్క్.
వర్క్ బాగా చేసిన ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ట్విట్టర్ షేర్లు ఇస్తానని ప్రకటించాడు. ఇందుకు సంబంధించి ఉద్యోగులందరికీ మెయిల్ పంపించాడు. ఆ షేర్ల విలువ దాదాపు 20 బిలియన్ డాలర్లు అని.. నాలుగేళ్ల తర్వాత వాటిని అమ్ముకోవచ్చని మెయిల్లో పేర్కొన్నాడు మస్క్. అయితే దీని వెనుక మస్క్ మాస్టర్ ప్లాన్ ఉందని ట్విట్టర్ మాజీ ఉద్యోగులు వెల్లడించారు.
పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం.. ట్విట్టర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం సబ్స్క్రిప్షన్ వంటివి తీసుకురావడంతో అటు ఉద్యోగుల్లో, యూజర్లలో మస్క్పై నెగిటివిటీ బాగా పెరిగింది. అలాగే మస్క్పై కోపంతో మంచి నైపుణ్యం కలిగిన ఉద్యోగులు కూడా రాజీనామా చేస్తున్నారు. ఈక్రమంలో వారిని ఆపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని మాజీ ఉద్యోగులు వెల్లడించారు.