Doctor: పానీపూరీ అంటే ఇష్టపడని వారుంటారా.. వందలో ఒకరో ఇద్దరో. అది తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా చాలా మంది ఇష్టంగా ఆరగించేస్తుంటారు. ఇక డాక్టర్లు కూడా పానీపూరీని తినొద్దని హెచ్చరిస్తుంటారు. కానీ ఈ డాక్టర్ అందరు డాక్టర్లలా కాదు.. తానే స్వయంగా ఆసుపత్రి ముందు పానీపూరీ బండి పెట్టి అమ్ముతుంది. ఈ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది.
అయితే ఆ డాక్టర్ అలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఇటీవల రాజస్థాన్లో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం కొత్త ఆరోగ్య బిల్లును తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు నష్టం వాటిల్లుతోంది. దీంతో అక్కడి వైద్యులంతా నిరసనలు తెలుపుతున్నారు. ఈక్రమంలోనే డాక్టర్ అనిత తన ఆసుపత్రికి తాళం వేసి.. పానీపూరి బండి పెట్టుకొని నిరసన తెలిపింది.
ఆసుపత్రి బోర్డు కూడా తీసేసి అనిత.. పుచ్కావాలీ అని పానీపూరీ షాపు బోర్డుపెట్టింది. అలాగే తన నేమ్ బోర్డ్ను కూడా మాజీ ప్రైవేట్ డాక్టర్ అని ఛేంచ్ చేసింది. ప్రస్తుతం ఆ డాక్టర్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కాగా ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం పేదలకు మేలు జరిగే విధంగా కొత్త ఆరోగ్య బిల్లును తీసుకొచ్చింది. అదే రైట్ టు హెల్త్. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరూ ఏ ఆసుపత్రిలోనైనా ఫ్రీగా ట్రీట్మెంట్ పొందవచ్చు. ఇందుకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.