Congress : లోక్సభ నుంచి రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ‘సంకల్ప్ సత్యాగ్రహ’ను చేపట్టింది. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ఆ పార్టీ నేతలు నిరసన దీక్షకు దిగారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, జైరామ్ రమేశ్, పవన్ కుమార్ బన్సల్, ముకుల్ వాస్నిక్ ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
ఢిల్లీ కాంగ్రెస్ నేతలు కూడా రాజ్ఘాట్కు చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలను మాత్రం పోలీసులు అనుమతించలేదు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా రాజ్ఘాట్ దగ్గర సత్యాగ్రహ దీక్షకు అనుమతి ఇవ్వలేమని ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీకి లేఖ రాశారు. అలాగే ఆ ప్రాంతంలో సెక్షన్ 144 విధించామని ప్రకటించారు.
పోలీసుల అనుమతి నిరాకరణపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. పార్లమెంటులో గొంతునొక్కిన కేంద్రం.. ఇప్పుడు మహాత్మాగాంధీ సమాధి వద్ద శాంతియుతంగా దీక్షను చేపట్టడానికి కూడా అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నిరసనను అణచివేయడం మోదీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. అయినాసరే సత్యం కోసం నిరంకుశపాలనపై పోరాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు.
మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో లోక్సభ సచివాలయం మార్చి 24న రాహుల్ పై అనర్హత వేటు వేసింది. ఈ నెల 23 నుంచే అనర్హత అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. రాజ్యాంగంలోని అధికరణం 102(1)(ఇ), ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ తన ట్విటర్ బయోను మార్చారు. తన డిజిగ్నేషన్ ను ‘అనర్హతకు గురైన ఎంపీ’గా పేర్కొన్నారు.