ISRO: ఇస్రో చేపట్టిన LVM3-M3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 36 ఉపగ్రహాలతో నింగిలోకి LVM3-M3 రాకెట్ విజయవంతంగా దూసుకెళ్లింది. మూడు దశల్లో ఈ ప్రయోగం సాగింది. రాకెట్ 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో ముందంజలో ఉందన్నారు.
ఈ ప్రయోగం కోసం ఇస్రో అధికారులు శనివారం ఉదయం 8.30 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభించారు. 24.30 గంటల కౌంట్డౌన్ అనంతరం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రయోగం చేపట్టారు. కౌంట్డౌన్ ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం నుంచే రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. ఆదివారం ఉదయానికి రాకెట్లోని అన్ని వ్యవస్థలను సన్నద్ధం చేసి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ ప్రయోగం ద్వారా 5,805 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్లో 87.4 డిగ్రీల వంపులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. నాలుగేసి ఉపగ్రహాల చొప్పున.. 9 విడతలుగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్వెబ్తో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా మొదటి 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబర్ 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా రెండో విడతలోనూ 36 ఉపగ్రహాలను పంపింది.