CCL:సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ ఛాంపియన్ గా నిలిచింది. విశాఖ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో భోజ్పురి దబాంగ్స్పై ఘన విజయం సాధించింది. నాలుగో సీసీఎల్ టైటిల్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి తెలుగు వారియర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భోజ్ పురి దబాంగ్స్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన తెలుగు వారియర్స్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు సాధించింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 32 పరుగులు ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన భోజ్ పురి టీమ్ 6 వికెట్లు కోల్పోయి 89 రన్స్ చేసింది. దీంతో 58 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే తెలుగు వారియర్స్ కు నిర్దేశించింది. ఈ టార్గెట్ ను తెలుగు వారియర్స్ సునాయాసంగా చేధించింది. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో (67 రన్స్ ) అదరగొట్టిన అక్కినేని అఖిల్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
దాదాపు మూడేళ్ల తర్వాత సీసీఎల్ టోర్ని మళ్లీ నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 8 జట్లు టోర్నిలో బరిలోకి దిగాయి. తెలుగు వారియర్స్, ముంబై హీరోస్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, బెంగాల్ టైగర్స్, భోజ్పురి దబాంగ్స్, పంజాబ్ దే షేర్స్ జట్లు టైటిల్ కోసం పోటీ పడ్డాయి. 2011లో సీసీఎల్ తొలి టోర్ని జరిగింది. అప్పుడు నాలుగు టీమ్లు మాత్రమే పాల్గొన్నాయి. గతంలో తెలుగు వారియర్స్ ( 2015, 2016, 2017) 3 టైటిళ్లు సొంతం చేసుకుంది. కర్ణాటక బుల్డోజర్స్, చెన్నై రైనోస్ రెండేసిసార్లు విజేతగా నిలిచాయి. ముంబై హీరోస్ ఒకసారి ఛాంపియన్ గా నిలిచింది. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భోజపురి దబాంగ్స్ తొలిసారి ఫైనల్కు చేరింది. టైటిల్ పోరులో మాత్రం చేతులెత్తేసింది.
ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : అఖిల్ అక్కినేని
బెస్ట్ బ్యాటర్ ఆఫ్ ది మ్యాచ్ : ఆదిత్య ఓజా (భోజ్పురి)
బెస్ట్ బౌలర్ ఆఫ్ ది మ్యాచ్ : తమన్
ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్ : అఖిల్ అక్కినేని
బెస్ట్ బ్యాటర్ ఆఫ్ ది టోర్నమెంట్ : ఆదిత్య ఓజా(భోజ్పురి)
బెస్ట్ బౌలర్ ఆఫ్ ది టోర్నమెంట్ : ప్రిన్స్
ఎంటర్టైనర్ ఆఫ్ ది సీజన్ : తమన్