Rahul Gandhi: రాహుల్ గాంధీ అనర్హత వేటుపై.. కాంగ్రెస్ తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే నిరసనలతో హోరెత్తిస్తున్న హస్తం శ్రేణులు.. ఆదివారం గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని నిర్ణయించాయి. దేశవ్యాప్తంగా రెండో రోజూ నిరసనలు కొనసాగాయి. రాహుల్ నియోజకవర్గమైన వాయనాడ్ లో.. ధర్నా చేపట్టారు. ఓ వైపు యూత్ వింగ్.. మరోవైపు మహిళా నేతలు నిరసనలకు దిగారు. ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో.. ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తెలంగాణలో పలు చోట్ల నిరసనలు హోరెత్తాయి. హైదరాబాద్ లో కాంగ్రెస్ విద్యార్థీ విభాగం.. NSUI ఆందోళన చేపట్టింది. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేసింది. విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆ పార్టీ శ్రేణులు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి. పలు చోట్ల మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని.. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరుగుతోన్న హాత్ సే హాత్ జోడో యాత్రలకు వస్తున్న ప్రజా స్పందనకు భయపడే.. మోడీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు.
కోల్ కతాలో కూడా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగగా.. చంఢీగడ్ లో రైల్ రోకో నిర్వహించారు. పట్టాలపైనే కూర్చొని.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో నల్లరిబ్బన్స్ తో నోటికి తాళం వేసుకుని.. రోడ్డుపై బైఠాయించారు. డరో మత్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం.. ఏఐసీసీ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్గాంధీకి మద్దతుగా నినాదాలు చేశారు. కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు రాహుల్ ప్రెస్ మీట్ పై.. బీజేపీ కౌంటర్ ఎటాక్ చేసింది. మీడియా ముందు రాహుల్ చెప్పినవన్నీ అబద్దాలే అని.. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఎదురుదాడికి దిగారు. నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ పై ఉన్న రాహుల్.. అవినీతి గురించి మాట్లాడటం.. విడ్డూరంగా ఉందన్నారు. 2019 లో ఆయన చేసిన వ్యాఖ్యలపై లోక్సభ సెక్రటరీ నిర్ణయం తీసుకున్నారని.. రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు.
అనర్హత వేటుపై కాంగ్రెస్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు.. ముందుకే వెళ్తామంటోంది. చట్టపరంగా, రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించింది.