Dog: హైదరాబాద్ లో ఇటీవల వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటన ఇంకా కళ్ల ముందు చెదిరిపోక ముందే.. మరోసారి అలాంటి ఘటన రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకుంది. బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ టీచర్స్ కాలనీలో ప్రకృతి ఆవాస్ అపార్ట్ మెంట్స్ సమీపంలో.. ఐదేళ్ల బాలుడిపై ఓ కుక్క అటాక్ చేసింది.
ఇంటి ముందు నడుస్తూ వెళ్తున్న చిన్నారిపై.. అటు నుంచి వస్తున్న ఓ కుక్క.. దాడికి పాల్పడింది. భయపడిన బాలుడు కేకలు వేశాడు. బాలుడి అరుపులు విన్న స్థానికులు పరుగున వచ్చి.. కుక్కను తరిమేశారు. అప్పటికే గాయాలపాలై రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న బాలుడిని.. 108 లో నారాయణగూడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి చెవి, కన్ను, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి ముందున్న సీసీ టీవీలో కుక్క దాడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
ఆ మధ్య అంబర్ పేట్ లో ఓ చిన్నారిని కుక్కలు చంపిన ఘటన.. తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు అక్కడడక్కడా జరుగుతూనే ఉన్నాయి. అంబర్ పేట్ ఘటన తర్వాత గ్రేటర్ కార్పొరేషన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామంటూ హామీలిచ్చారు. మంత్రులు, గ్రేటర్ ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతా హడావుడి చేసినా.. ఇంకా కుక్కల దాడుల్లో చిన్న పిల్లలు బలవుతూనే ఉన్నారు.