Kotamreddy: కోటంరెడ్డి మళ్లీ కస్సుమన్నారు. తనపై సస్పెన్షన్ వేటు వేయడం కాదు.. ప్రజలే వైసీపీని డిస్మిస్ చేసే రోజులు రానున్నాయంటూ మండిపడ్డారు. చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తనలానే లోలోన రగిలిపోతున్నారంటూ బాంబు పేల్చారు. మరో పార్టీ వైపు చూస్తున్నారంటూ మరింత మంట రాజేశారు. 2024లో రాజకీయ ప్రజా సునామీ రాబోతోందని హెచ్చరించారు. పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించి స్పష్టమైన ప్రజా తీర్పు ఇచ్చారని అన్నారు. వచ్చే ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని చెప్పారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలతో రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. ఆయన్ను సస్పెండ్ చేసిన కొన్ని గంటల్లోనే.. శ్రీధర్రెడ్డి సోదరుడు గిరిధర్రెడ్డి టీడీపీలో చేరి సీఎం జగన్కు సవాల్ విసిరారు. శ్రీధర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన అఫీషియల్గా పసుపు కండువా కప్పుకోలేరు. టీడీపీలో చేరితే ఆయన ఎమ్మెల్యే పదవి ఫసక్ అంటుంది. అందుకే, తన తరఫున తన తమ్ముడు గిరిధర్రెడ్డిని భారీ కాన్వాయ్తో మందీమార్బలంగా నెల్లూరు నుంచి మంగళగిరికి పంపించి.. భారీ బలప్రదర్శనతో అధికార పార్టీని ఛాలెంజ్ చేశారు కోటంరెడ్డి బ్రదర్స్.
ఒకరోజు టైమ్ తీసుకుని.. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి తన సస్పెన్షన్ వేటుపై కౌంటర్ ఇచ్చారు. తాను రెండు నెలల క్రితమే పార్టీకి దూరమయ్యానని.. ఇకపై ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తానని అన్నారు.