Rahul gandhi: పార్లమెంట్లో ఉన్నా.. బయట ఉన్నా తన పనిని తాను చేసుకుంటూ పోతానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఎంపీగా అనర్హత వేటు వేసిన తర్వాత మొదటిసారి మీడీయాతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని వెల్లడించారు. తాను ప్రజాస్వామ్యం కోసం పోరాడానని.. ఇకపై కూడా పోరాడుతూనే ఉంటానని అన్నారు. తనపై అనర్హత వేటు వేసినా.. .జైలుకి పంపించినా తగ్గేదే లేదు అని స్పష్టం చేశారు.
అదానీ షెల్ కంపెనీలలో రూ.20 వేల కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టారని ప్రశ్నించారు. ఆ డబ్బు ఎక్కడిదని నిలదీశారు. అందులో కొన్ని రక్షణ రంగానికి చెందినవి కూడా ఉన్నాయని ఆరోపించారు. దీనిపై రక్షణ శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అదానీ, ప్రధాని మోదీల స్నేహం ఇప్పడిది కాదని.. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పటి నుంచి వారిద్దరి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి పోర్టులన్నింటిని అదానీకి కట్టబెట్టారని మండిపడ్డారు.
అదానీ వ్యవహారం గురించి పార్లమెంట్కు సాక్ష్యాలను సమర్పించానని తెలిపారు. స్పీకర్కు రెండు సార్లు లేఖ రాసినా సమాధానం రాలేదన్నారు. అతని ఛాంబర్కు వెళ్లి అడిగితే .. ఓ నవ్వు నవ్వి తాను ఏం చేయాలేనని చెప్పి ఛాయ్కు ఆహ్వానించారని వెల్లడించారు.
అదానీ గురించి లోక్సభలో మాట్లాడినప్పుడు ప్రధాని మోదీ కళ్లల్లో భయాన్ని చూశానని తెలిపారు. తన ప్రసంగాన్ని కావాలనే తొలగించారిన రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తన గురించి మంత్రులు పార్లమెంట్లో అబ్దాలు చెప్పారని.. తన లండన్ ప్రసంగంపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. తన తర్వాతి ప్రసంగానికి బయపడే అనర్హత వేటువేశారని తెలిపారు. తనకు జైలు శిక్ష వేసినా పట్టించుకోనని వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లడమే ఇప్పుడు విపక్షాలకు ఉన్న అవకాశమన్నారు.
ప్రజలతోనే ఉంటానని.. ఇప్పటికే భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వెళ్లానని రాహుల్ గాంధీ అన్నారు. ప్రేమ, మర్యాద, ఇంకెంతో ఇచ్చిన ఈ దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని తెలిపారు. తన మనసులో ఏముందో వయనాడు ప్రజలకు లేఖ రాస్తానని చెప్పారు. పార్లమెంట్లో ఉన్నా.. బయట ఉన్నా తన పనిని తాను చేసుకుంటూ పోతానని స్పష్టం చేశారు. తన పేరు సవార్కర్ కాదని.. గాంధీ అని అన్నారు. క్షమాపణలు చెప్పే కుటుంబం తమది కాదని వెల్లడించారు.
అదానీతో కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు సంబంధం ఉందని తేలితే వెంటనే వారిని జైల్లో వేయండి అని అన్నారు. ఇతర పార్టీ వాళ్లు కూడా ఎవరున్నా వాళ్లను కూడా జైల్లో పెట్టాలని అన్నారు.