Srividya Pooja : లక్ష్మీ నారాయణి స్వర్ణ దేవాలయం తమిళనాడులోని మలైకుడి అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున ఉంది. 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ గుడిని నిర్మించారు. ఈ స్వర్ణ దేవాలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించారు. గర్భ గుడిని సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పారు. ఆలయ ఆవరణం నక్షత్రం ఆకారంలో ఉంటుంది. గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుండి సేకరించిన శ్లోకాలతో పొందుపరిచారు.
ఈ ఆలయంలో ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చేయరు. కానీ శ్రీ విద్య అనే ప్రాచీనమైన, అరుదైన శక్తి పూజా విధానాన్ని అనుసరిస్తారు. శ్రీ విద్య అనగా ఒక జీవన మార్గము. సంతోషకరమైన జీవనము జీవించడానికి కావలసిన మార్గమును సుగమం చేస్తూ, చుట్టూ ఉన్నవారితో సరిగా వ్యవహరించే పద్ధతిని నేర్పేదే శ్రీ విద్య. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడాన్ని నేర్పేదే శ్రీ విద్య. సంపూర్ణమైన శక్తితో, జాగరూకతతో, అన్నిటినీ మించి, చుట్టుపక్కల ఉన్న ప్రపంచంతో సంతోషవంతంగా జీవించడాన్ని, శ్రీ విద్య మనకు నేర్పుతుంది. .
నారాయణి అమ్మ స్వామి ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు దీని ద్వారానే లభించాయి. 3 కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 600 దేవాలయాలను జీర్ణోద్ధరణ కూడా చేసారు. ఈ దేవాలయములో గర్భగుడికి మూడు వైపులా నీరు, ఒకవైపు ద్వారం ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఆ నీటిని పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది.