Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికల హడావుడి అప్పుడే మొదలయింది. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. మే నెలతో ప్రస్తుతం శాసనసభ గడువు ముగియనుంది. ఈక్రమంలో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను రిలీజ్ చేసింది.
ఊహించినట్లుగానే ఆపార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈసారి కోలార్ నుంచి కాకుండా తన కుమారుడు యతీంద్ర నియోజకవర్గం వరుణ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన మేరకే ఈసారి వరుణ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. తన తండ్రి కోసం యతీంద్ర తన స్థానాన్ని త్యాగం చేశారు. అయితే తాజా జాబితాలో యతీంద్ర పేరు లేకపోవడం ఈ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగకపోవచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇక ఆ పార్టీ అగ్రనేత డీకే శివకుమార్ కనకపురం నియోజకవర్గం నుంచి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చీతాపూర్ నుంచి , జి.పరమేశ్వర కోరటగెరె స్థానం నుంచి పోటీకి దిగనున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది.