JP: జయప్రకాశ్ నారాయణ. లోక్సత్తా వ్యవస్థాపకుడు. ఆయన అంతా కరెక్టే మాట్లాడతారనే అభిప్రాయం ఇప్పటికీ ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన గట్టి పోరాటమే చేశారు. అప్పుడప్పుడు సంచలన సంఘటనలు జరిగినప్పుడు స్పందిస్తూ ఉంటారు. తాజాగా, ఎంపీగా రాహుల్గాంధీని అనర్హుడిగా ప్రకటించడాన్ని జేపీ తీవ్రంగా తప్పుబట్టారు. అనర్హత ప్రధాన ఆయుధం కాకూడదని, అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని అన్నారు. రాహుల్ గాంధీకి పైకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉందని.. అక్కడ శిక్ష తగ్గితే అనర్హత వేటును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
రాహుల్గాంధీ.. మోదీ ఇంటి పేరు చెప్పి దూషించడం పొరపాటేనని.. కానీ, చిన్న చిన్న కారణాలకే అనర్హత వేటు వేయడం మాత్రం సరికాదన్నారు జేపీ. అలాగైతే నూటికి 99 మంది తమ పదవులను కోల్పోవాల్సి వస్తుందన్నారు. రాహుల్ గాంధీ విషయంలో చేసిన నేరానికి , పడిన శిక్షకు చాలా వ్యత్యాసం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికకు దారి తీసేలా అనర్హత వేటు వేయడం మంచిది కాదన్నారు.
లోక్సభ అధికారులు తొందరపడకుండా అనర్హతను అమలు చేయాల్సింది కాదని.. న్యాయ నిపుణుల సలహా తీసుకొని నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. ఎంపీగా రాహుల్గాంధీపై వేటు ప్రభావం రానున్న ఎన్నికల్లో బీజేపీపై ఎంతో కొంత ఉంటుదని జయప్రకాశ్ నారాయణ అన్నారు.