Campa: టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనం. లేటెస్ట్గా వచ్చి కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఫ్రీగా అన్లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్ ఇచ్చి కస్టమర్లను తమ వైపు లాగేసుకుంది. అతి తక్కువ సమయంలోనే కోట్లాది మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. టెలికాం రంగంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఇదే వ్యూహాన్ని సాఫ్ట్డ్రింక్ విషయంలోనూ రిలయన్స్ అప్లై చేయనున్నట్లు తెలుస్తోంది.
గతేడాది రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఒకప్పటి ఫేమస్ సాప్ట్ డ్రింక్ కాంపాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తిరిగి కాంపా బ్రాండ్ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆరెంజ్, లెమన్ ఫ్లెవర్లలో ఈ డ్రింక్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే ఎన్ని సాఫ్ట్ డ్రింక్లు మార్కెట్లోకి వచ్చినప్పటికీ అంతర్జాతీయ బ్రాండ్స్ కోకాకోలా, పెస్పీలను ఢీ కొట్టలేకపోతున్నాయి. కొన్నేళ్లుగా మార్కెట్లో ఆ డ్రింకులదే హవా నడుస్తోంది.
ఈక్రమంలో కోకాకోలా, పెప్సీలను ఎలా అయినా ఢీ కొట్టాలని రిలయన్స్ సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. జియో విషయంలో అనుసరించిన వ్యూహాన్ని సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లోనూ అనుసరించాలని రిలయన్స్ భావిస్తోంది. ఈ మేరకు ఇతర డ్రింక్లతో పోలిస్తే కంపా సాఫ్ట్డ్రింక్ను తక్కువ ధరకే విక్రయించాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ డ్రింక్ 2 లీటర్ల బాటిల్ను మార్కెట్లో కేవలం రూ. 49లకే విక్రయిస్తోంది.
అలాగే ఈ బ్రాండ్కు సంబంధించి పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చేందుకు కంపెనీ రెడీ అవుతోంది. త్వరలో ప్రారంభం కానున్న ఐపీలో టోర్నీలో కాంపా గురించి పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు మూడు జట్లతో చర్చలు జరుపుతోంది.