Rahul Gandhi: ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఇటీవలే రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. టెక్నికల్గా రెండేళ్ల జైలు శిక్ష పడితే అనర్హత వేటు వేసే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్ ను పట్టుకుని.. యాక్షన్ లోకి దిగింది కేంద్రం.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ.. లోక్ సభ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆర్టికల్ 102(1)(E) ప్రకారం.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం అనర్హత వేటు వేస్తున్నట్టు తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం- రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి.. తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. జైలు శిక్షకాలంతో పాటు మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అనర్హులు అవుతారు. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఎంపీగా రాహుల్ గాంధీపై వేటు వేయడంపై కేంద్రం వైఖరిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడుతోందని విమర్శిస్తున్నారు. న్యాయ పోరాటంతో తేల్చుకుంటామని చెబుతున్నారు.
నిజాలు మాట్లాడితే ఎన్డీఏ ప్రభుత్వం ఓర్చుకోవడం లేదని.. లలిత్ మోదీ, నీరవ్ మోదీ స్కాంలపై రాహుల్ గాంధీ మాట్లాడితే కక్ష కట్టారని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యని.. బీజేపీ కుట్రల్ని తిప్పికొడతామని అన్నారు. మోదీ ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరిస్తోందని దిగ్విజయ్ సింగ్. రాహుల్ అనర్హత వేటుపై పోరాడుతామన్నారు జైరాం రమేశ్. అదానీపై చర్చ జరగకుండా కేంద్రం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు.
విషయం తెలిసి ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు అత్యవసర భేటీ అవుతున్నారు. పార్టీ ఎంపీలంతా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సూచించారు. భారత్ జోడో యాత్ర సక్సెస్ చూసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ భయపడుతోందని.. రాహుల్ను పార్లమెంట్కు రాకుండా చేసే కుట్ర చేశారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలకు సిద్దమవుతున్నాయి.
అసలు కేసు ఏంటి..?
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభల్లో కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో కర్ణాటక కోలార్లో ఎన్నికల ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక నేరస్తులకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. అదే విధంగా ప్రధాని మోదీపైనా రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ఇంటిపేరుపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ‘మోదీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలే’ అని వ్యాఖ్యానించారు. నీరవ్ మోదీ వ్యవహారాన్ని గుర్తు చేస్తూ రాహుల్ ఈ కామెంట్స్ చేశారు.
మోదీపై ఇంటిపేరుపై రాహుల్ చేసిన ఆ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలు మండిపడ్డారు. తమ కమ్యూనిటీని అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడారంటూ గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన సూరత్ న్యాయస్థానం.. నాలుగేళ్ల తర్వాత రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. రెండేళ్లు జైలు శిక్ష విధించింది. బెయిల్ కూడా మంజూరు చేసింది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలుకు 30 రోజుల సమయం ఇచ్చింది. ఈ లోగా లోక్సభ యాక్షన్లోకి దిగింది. రెండేళ్ల శిక్షను కారణంగా చూపిస్తూ.. ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్ సభ సెక్రటరీ జనరల్ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా కలకలం రేపింది.