Bandi Sanjay : TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగిస్తున్న సిట్ కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని తెలిపారు. పార్లమెంట్ సెషన్ ముగిసిన తర్వాత సిట్ హాజరవుతానని చెప్పారు.
మరోవైపు సిట్ దర్యాప్తుపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. సిట్ను విశ్వసించడం లేదని స్పష్టం చేశారు.
సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని చెప్పారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్కు ఇవ్వదల్చుకోలేదని బండి సంజయ్ ప్రకటించారు. TSPSC పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నమ్మకమున్న సంస్థలకే సమాచారం ఇస్తానని తేల్చిచెప్పారు.
మరోవైపు తనకు సిట్ నుంచి నోటీసులు అందలేదని బండి సంజయ్ అన్నారు. మీడియాలో వచ్చిన సమాచారంతో ఈ విషయంపై స్పందిస్తున్నానన్నారు. ఈ నెల 24న విచారణ హాజరుకావాలని కోరినట్లు మీడియా ద్వారా తెలిసిందన్నారు. లోక్ సభ సభ్యునిగా తాను పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉందని తెలిపారు. తాను ఖచ్చితంగా హాజరు కావాలని సిట్ భావిస్తే మరో తేదీ చెప్పాలని కోరారు.
TSPSC పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్కు సిట్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. మార్చి 24న తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇప్పటికే సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న తగిన ఆధారాలతో తమ ఎదుట హాజరు కావాలని కోరింది. సిట్ నోటీసులు అందుకున్న రేవంత్ విచారణ హాజరయ్యారు. బండి సంజయ్ మాత్రం విచారణకు హాజరుకాకుండా మరో తేదీ చెప్పాలని కోరారు. మరి సిట్ బండి సంజయ్ కు మరోసారి నోటీసులు జారీ చేస్తుందా..? మరి ఆయనను ఎప్పుడు విచారణకు పిలుస్తుంది?