AP Legislative Council: ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్ హీట్ ను పెంచేశాయి. సాధారణ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ, టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఓటర్ పల్స్ ను స్పష్టంగా తెలియజేస్తున్నాయిని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 3 పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకుని పండగ చేసుకుంటున్న టీడీపీకి ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా ఒక స్థానం దక్కడంతో ఆ పార్టీలో జోష్ మరింత పెరిగింది. ఈ ఫలితాలతో వైసీపీలో అంతర్మథనం మొదలైంది.
తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో పార్టీల బలాబలాలు మారాయి. మండలిలో మొత్తం 58 సభ్యులున్నారు. తాజాగా 21 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల కోటాలో 9, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో 17 స్థానాలు వైసీపీకి దక్కాయి. 4 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మండలిలో వైసీపీకి 33 మంది సభ్యులున్నారు. వారిలో ఏడుగురు సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. తాజాగా 17 స్థానాలు గెలవడంతో ఆ పార్టీ బలం 43కు పెరిగింది. గవర్నర్ కోటాలో ఇద్దరు సభ్యులు వైసీపీ నుంచి ఎన్నికకానున్నారు. దీంతో వైసీపీ సభ్యుల సంఖ్య 45కు చేరుకోనుంది.
తాజా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీడీపీ సభ్యుల సంఖ్య 17. ఆ పార్టీకి చెందిన 11 మంది సభ్యుల్లో కొందరి పదవీకాలం ఈ నెలాఖరుకు, మరికొందరి పదవీకాలం మే నెలాఖరుతో పూర్తికానుంది. అయితే తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి కొత్తగా నలుగురు మాత్రమే గెలిచారు. దీంతో టీడీపీ బలం ఇప్పుడు 10కి తగ్గనుంది.
ఇప్పటి వరకు మండలిలో పీడీఎఫ్కు ఐదుగురు సభ్యులుండగా .. తాజా ఎన్నికల తర్వాత వారి సంఖ్య మూడుకు పరిమితమైంది. బీజేపీకి ఉన్న ఒక్క సభ్యుడూ ఓడిపోవడంతో ఆ పార్టీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది.