TSPSC: పేపర్ లీకేజీ ఎపిసోడ్ తెలంగాణను షేక్ చేస్తోంది. నిరుద్యోగులు డీలా పడ్డారు. ప్రతిపక్షాలు డైనమిక్గా మారాయి. విపక్ష నేతలంతా కేటీఆర్నే టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ ఆఫీసు నుంచే పేపర్ లీక్ జరిగిందని.. ఆయన పీఏ తిరుపతి హస్తం ఉందంటూ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నేరుగా ఆరోపణలు చేశారు. బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ సైతం కల్వకుంట్ల కుటుంబం డైరెక్షన్లోనే TSPSC ప్రశ్నాపత్రాల లీకేజ్ జరిగిందని విమర్శలు చేశారు. గత గ్రూప్ 1 పరీక్ష సైతం లీక్ అయిందని.. ఎన్నారైలకు పేపర్ అమ్ముకున్నారని.. ఇలా గట్టిగానే దాడి చేశారు ఆ ఇద్దరు నేతలు.
పేపర్ లీకేజీ కేసులో పదే పదే తన పేరు ప్రస్తావిస్తుండటంతో మంత్రి కేటీఆర్ బాగా హర్ట్ అయినట్టున్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి, బండి సంజయ్లకు లీగల్ నోటీసులు పంపించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
గతంలో డ్రగ్స్ కేసులోనూ ఇలానే జరిగింది. కేటీఆర్కు డ్రగ్స్ అలవాటు ఉందని.. గోవాలో డ్రగ్స్ తీసుకున్నారంటూ.. సంచలన ఆరోపణలు చేశారు రేవంత్రెడ్డి. దమ్ముంటే డ్రగ్స్ టెస్ట్కు సిద్ధమా అంటూ వైట్ ఛాలెంజ్ కూడా విసిరారు. రేవంత్ ఛాలెంజ్ని కేటీఆర్ స్వీకరించలేదు. డ్రగ్స్ విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ కోర్టుకు వెళ్లారు. కేటీఆర్పై అలాంటి ఆరోపణలు చేయొద్దంటూ న్యాయస్థానం ఆదేశించడంతో ఆ ఎపిసోడ్ అలా ముగిసింది.
ఇప్పుడు టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజీ కేసులోనూ అదే తరహాలో మంత్రి కేటీఆర్పై విమర్శలు చేస్తున్నారు రేవంత్రెడ్డి. పేపర్ లీక్ గురించి కేటీఆర్కు అన్ని విషయాలు తెలుసునని.. నిందితులు ఇద్దరే అని ఎలా చెబుతారని.. కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వాలని.. ఇలా పొలిటికల్ అటాక్ చేస్తున్నారు రేవంత్. బండి సంజయ్ సైతం కేటీఆర్ టార్గెట్గానే విమర్శలు చేస్తుండటంతో వాళ్లిద్దరికీ లీగల్ నోటీసులు ఇచ్చారు మంత్రి కేటీఆర్.