AP High court: ఏపీకి మూడు రాజధానులు. అమరావతి కేవలం శాసన రాజధాని మాత్రమే. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా చేసి.. అక్కడి నుంచే పాలన కొనసాగిస్తాం. కర్నూలును న్యాయ రాజధాని చేస్తాం.. ఇలా అధికార వైసీపీ పదే పదే స్టేట్మెంట్లు ఇస్తోంది. మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టినా.. హైకోర్టు మొట్టికాయలు వేయడంతో విత్డ్రా చేసుకుంది. త్వరలోనే విశాఖ నుంచే పాలన అంటూ ఊరూవాడా ఊదరగొడుతోంది. అదే జరిగితే.. కర్నూలుకు హైకోర్టు తరలించాల్సి ఉంటుంది. అది అంత ఈజీగా జరిగే పని కాదు.
లేటెస్ట్గా, ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలోనే ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైకోర్టు అమరావతిలో ఏర్పాటు అయిందని.. కర్నూలుకు తరలిచాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆ మేరకు రాజ్యసభలో ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
రాజ్యాంగంలోని 214 నిబంధన, 2018లో కేంద్రం వర్సెస్ దన్ గోపాల్ రావు, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేయబడిందని కేంద్ర మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న.. అప్పటి హైదరాబాద్ హైకోర్టు, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదించారని కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయని కిరణ్ రిజిజు గుర్తు చేశారు. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని.. అమరావతిలో, పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీని ఆదేశించిందన్నారు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.