Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో న్యాయస్థానం రాహుల్ ను దోషిగా తేల్చింది.
అసలు కేసు ఏంటి..?
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభల్లో కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో కర్ణాటక కోలార్లో ఎన్నికల ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక నేరస్తులకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. అదే విధంగా ప్రధాని మోదీపైనా రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ఇంటిపేరుపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.‘మోదీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలే’ అని వ్యాఖ్యానించారు. నీరవ్ మోదీ వ్యవహారాన్ని గుర్తు చేస్తూ రాహుల్ ఈ కామెంట్స్ చేశారు.
మోదీపై ఇంటిపేరుపై రాహుల్ చేసిన ఆ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలు మండిపడ్డారు. అదే సమయంలో తమ కమ్యూనిటీని అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడారంటూ గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన సూరత్ న్యాయస్థానం.. రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే బెయిల్ కూడా మంజూరు చేసింది. కానీ సూరత్ కోర్టు తీర్పును రాహుల్ గాంధీ హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.