TSPSC: టీఎస్పీఎస్సీలో పని చేసే ఉద్యోగులు పబ్లిక్ కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకూడదనేది నిబంధన. కానీ, చాలామంది ఉద్యోగులు ఈ రూల్ని బ్రేక్ చేశారు. సంస్థలో పేపర్లు కాజేసి.. పరీక్షలు రాశారు. మార్కులు కొట్టేశారు. అలా ఒకరు ఇద్దరు కాదు.. ప్రస్తుతానికి 42 మంది ఉద్యోగులపై సిట్కు అనుమానాలు ఉన్నాయి. వారందరికీ నోటీసులు జారీ చేసింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్తో సంబంధాలున్న వారందరినీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే శంకర్లక్ష్మిని రెండుసార్లు పిలిచి ప్రశ్నించిన సిట్.. టెక్నికల్ డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్నవారందరినీ విచారిస్తోంది.
గ్రూప్ 1లో మొత్తం 103 మందికి 100కి పైగా మార్కులు వచ్చాయి. పరీక్ష రాసిన వారి డిటైల్స్ బయటకు తీస్తే.. వారిలో 20 మంది TSPSC ఉద్యోగులు ఉన్నట్టు తేలింది. ఆ 20 మంది ఉద్యోగుల్లో 8 మంది గ్రూప్ 1కి క్వాలిఫై అయ్యారు. ఆ 8 మందిలో ఇద్దరికి 100కి పైగా మార్కులు వచ్చాయి. ఆ ఆధారాలతో ముగ్గురు ఉద్యోగులను నిందితులుగా చేర్చారు సిట్ అధికారులు.
అయితే, ఉద్యోగులే పేపర్ లీక్ చేసి పరీక్ష రాశారా? లేదంటే, రాజశేఖర్ నుంచి వీళ్లు పేపర్లు తీసుకున్నారా? అనే కోణంలో విచారిస్తున్నారు. రాజశేఖర్ స్నేహితుడు సురేష్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. TSPSC నుంచి రాజశేఖర్ పేపర్ తీసుకొచ్చి సురేష్కు ఇచ్చినట్లు గుర్తించారు అధికారులు. మరి ఆ పేపర్ను సురేష్ ఎంతమందికి ఇచ్చారన్న దానిపై సిట్ ఆరా తీస్తోంది.
ఇక, కేసుతో సంబంధం ఉన్న 9 మంది నిందితులను 7 గంటల పాటు ప్రశ్నించింది సిట్. వారి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కాల్డేటాను పరిశీలించారు. పరీక్ష నిర్వహించిన సమయంలో ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడారనేది తెలుసుకొని వారందరికీ నోటీసులు జారీ చేశారు. రేణుక, నీలేష్, గోపాల్ మధ్య జరిగిన 14 లక్షల లావాదేవీలపై సిట్ కూపీ లాగింది. రాజశేఖర్ వాట్సాప్ చాటింగ్నూ అనాలిసిస్ చేస్తోంది.
నిందితురాలు రేణుక, ఆమె భర్త డాక్య పలువురు పోటీ పరీక్షల అభ్యర్థులతో పాటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడినట్టు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. రేణుక కాల్ డేటా ఆధారంగా అభ్యర్థులతో పాటు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నారు. పేపర్ లీకేజీ కేసులో తీగలు లాగుతున్న కొద్దీ.. డొంకలు భారీగానే కదులుతున్నాయి.