TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం ప్రతిపక్షాలకు అందివచ్చిన ఆయుధంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్లు పోటాపోటీగా సర్కారును టార్గెట్ చేస్తున్నాయి. సీబీఐ విచారణ కోరుతూ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేస్తే.. దీక్షలు, ధర్నాలు, ముట్టడిలతో కమలనాథులు కదనోత్సాహం కనబరుస్తున్నారు.
నిరుద్యోగులకు మద్దతుగా భారీ ఆందోళనకు సిద్ధమైంది బీజేపీ. ‘మా నౌకరీలు మాగ్గావాలె’ నినాదంతో ఈనెల 25న ఇందిరాపార్క్ దగ్గర నిరుద్యోగ మహా ధర్నా చేపట్టనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ యువతతో కలిసి ధర్నా చేయనుంది.
పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని.. వారికి మద్దతుగా విస్తృత పోరాటం చేయాలని బీజేపీ భావిస్తోంది. సాగరహారం, మిలియన్ మార్చ్ తరహాలో ఉద్యమాలు చేయడంపై చర్చించింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని.. వెంటనే ఆయన్ను బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని, వెంటనే ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయాలనే డిమాండ్లతో ఈ నెల 25న ఇందిరాపార్క్ దగ్గర నిరుద్యోగ మహాధర్నా చేస్తామని బీజేపీ ప్రకటించింది.
బీజేపీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. యువత నిరాశకు గురికావొద్దని బండి సంజయ్ పిలుపిచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, మీడియా సంస్థలపై దాడులు, జర్నలిస్టుల అరెస్ట్ వంటి అంశాలపై బీజేపీ అగ్రనేతలు చర్చించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై మంత్రులు మాట్లాడటం లేదు కానీ.. కవిత కోసం మాత్రం మంత్రులు షిఫ్ట్ పద్దతిలో ఢిల్లీ వెళ్లారంటూ బండి సంజయ్ విమర్శించారు. పేపర్ లీకేజ్ కేసులో కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.