Aadhaar: ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. అయినా, ఇంకా లొసుగులు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిని గుర్తించి, ఒక్కోటిగా పరిష్కరిస్తోంది. ఓటర్ ఐడీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఆధార్తో అనుసంధానించాలని భావించింది. ఇప్పటికే ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఓటర్లంతా తప్పనిసరిగా ఓటర్ కార్డును ఆధార్తో లింక్ చేయించుకోవాలని సూచించింది. ఈ ఏడాది మార్చి 31కి వరకు గడువు ఇచ్చింది.
తెలుసుగా మనోళ్ల సంగతి. తమకు నేరుగా కష్టమో, ఇబ్బందో కలగనంత వరకూ ఏ పనీ చేయరు చాలామంది. ఇక ఓటరు కార్డు-ఆధార్ లింకు అంటే ముందుకొస్తారా? ఆ.. చూద్దాంలే అని లైట్ తీసుకున్నారు. గడువు సమీపిస్తున్నా.. ఇప్పటికీ చాలా ఓటర్ కార్డ్లు ఆధార్తో జత చేయబడలేదు. దీంతో సర్కారే వెనక్కి తగ్గింది. ఓటర్లు చాలా బిజీగా ఉన్నట్టున్నారు.. ఈ ఏడాది మార్చి 31 వరకు కుదరకపోతే.. మరో ఏడాది సమయం ఇస్తున్నాం.. 2024 మార్చి 31 వరకైనా ఓటర్ ఐడీని ఆధార్తో అనుసంధానం చేసుకోమంటూ గడువు పెంచింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
గతేడాది జూన్ 17న న్యాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2023 ఏప్రిల్ 1తో గడువు ముగియనుంది. నిబంధనల ప్రకారం ఓటర్లు ఫామ్ 6-బీను సమర్పించాల్సి ఉంది. గతేడాది ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి ఆధార్ నెంబర్లు సేకరించడం మొదలుపెట్టింది. డిసెంబర్ 12వ తేదీ వరకు 54.32 కోట్ల ఆధార్ సంఖ్యలను సేకరించినట్టు తెలుస్తోంది. కానీ, వీటిని అనుసంధానించే ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు.
మరోవైపు పాన్కార్డును ఆధార్తో అనుసంధానించే ప్రక్రియకు తుది గడువును పొడిగించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. వెయ్యి రూపాయల అపరాద రుసుమును సైతం రద్దు చేయాలని అంటున్నాయి. ఆధార్-పాన్ అనుసంధానానికి మార్చి 31తో గడువు ముగియనుంది. ఆలోగా లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు. మరి, ఓటర్ కార్డుకు పెంచినట్టే పాన్ కార్డుకు కూడా గడువు పెంచుతుందా? అంటే డౌటే అంటున్నారు. ఇప్పటికే ఓ ఏడాది ఎక్స్టెన్డ్ చేశారని.. ఈసారి మళ్లీ చేయకపోవచ్చని అంటున్నారు.