Tollywood : పండగల సమయంలో టాలీవుడ్ లో సినిమాలు విడుదల కావడం సంప్రదాయం . అలాగే రాబోయే మూవీల టైలర్లు, టీజర్లు, పోస్టర్లు ప్రత్యేక పర్వదినాల రోజు విడుదల చేయడం కామన్. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో ఉగాది సందడి నెలకొంది. కొత్త సినిమాల అప్ డేట్స్ తో సోషల్మీడియా షేక్ అవుతోంది.
వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ఉగాదిని పురస్కరించుకొని ఫ్యాన్స్ కు తీపికబురు చెప్పారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాను ఆగస్టు 11న విడుదల చేస్తామని ప్రకటించారు. ఉగాది వేళ భోళా శంకర్ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ కీలక పాత్ర పోషిస్తోంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులకు పండగలాంటి వార్త చెప్పారు. ‘ఈ సారి మీ ఊహలకు మించి’ అంటూ తన కొత్త సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఇలా బాలయ్య అభిమానులకు తన కొత్త సినిమా ఫస్ట్లుక్తో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. అఖండ , వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్తో ఫుల్ జోష్ మీద ఉన్న బాలయ్య అదే జోరుతో తన కొత్త సినిమా ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు. పవర్ఫుల్ లుక్తో ఉన్న ఈ పోస్టర్ ఈ మూవీపై అంచనాలను పెంచేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా షూటింగ్లో జాయిన్ అయింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే సోషల్మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. నాని మాస్లుక్లో కనిపించనున్న ఈ మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉగాది సందర్భంగా ఈ చిత్రబృందం ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శాకుంతలం. సమంత లీడ్ రోల్ చేసింది. అనేకసార్లు విడుదల వాయిదా పడిన ఈ మూవీ ఎట్టికేలకు ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకురాబోతోంది.