CM Jagan : తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ నివాసంలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా గోశాలలో ఉగాది వేడుకలు జరిగాయి. పంచెకట్టుతో తెల్లని వస్త్రాలు ధరించి ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. అంతకుముందు శ్రీవేంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్ దంపతులు పూజలు నిర్వహించారు. ఉగాది పచ్చడిని స్వీకరించారు.
నూతన పంచాంగాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. కప్పగంతు సుబ్బరాయ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని సుబ్బరాయ సోమయాజి తెలిపారు. ఉద్యోగులు, శ్రామికులు, రైతులకు మంచి ఫలితాలు ఉంటాయన్నారు. పాడి పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని వివరించారు. ఆహార ఉత్పత్తులతో ముడిపడిన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఈకార్యక్రమంలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, రోజా, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, కొంతమంది వైసీపీ నాయకులు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేశారు. గోడలకు ఏర్పాటు చేసిన దశావతారాల బొమ్మలు ఆకట్టుకున్నాయి.
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని, రైతులకు మేలు కలగాలని, అక్కచెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.