Actress Hema : సీనియర్ నటి హేమ కొన్ని యూ ట్యూబ్ చానెల్స్పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు మీడియా ఫ్రెండ్లీగా ఉండే హేమ హఠాత్తుగా ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేశారంటే.. సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని కొన్ని యూ ట్యూబ్ చానెల్స్ ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. కొన్ని యూ ట్యూబ్ చానెల్స్ వాళ్లు సినీ సెలబ్రిటీలకు సంబంధించిన తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని హేమ మండి పడ్డారు. మరికొంత మంది అయితే సెలబ్రిటీలు బావున్నా, నిజా నిజాలు తెలుసుకోకుండా చనిపోయారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె తన కంప్లైంట్లో పేర్కొన్నారు.
కొన్ని యూ ట్యూబ్ చానెల్స్ థంనైల్స్ విషయంలో తప్పుడు టైటిల్స్ పెట్టి చనిపోయారంటూ తప్పుడు ప్రచారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పిన హేమ అందుకు కోట శ్రీనివాసరావు ఉదంతమే పెద్ద ఉదాహరణ అని తెలిపారు. ఆయన బతికే ఉన్నప్పటికీ చనిపోయినట్లు కొందరు ఫేక్ న్యూస్ను క్రియేట్ చేశారని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో రోజు రోజుకీ ఇలాంటి వార్తలు ఎక్కువ అవుతున్నాయని కూడా హేమ తెలిపారు.
మంగళవారం ఉదయం సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయారంటూ సోషల్ మీడియాల్లో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో మీడియా కాస్త కంగారు పడింది. కొందరు మీడియా మిత్రులు వెంటనే అలర్ట్ అయ్యి విషయాన్ని తెలుసుకుంటే కోట బాగానే ఉన్నారు. వెంటనే ఆయన తాను బాగానే ఉన్నానని, తప్పుడు వార్తలను నమ్మొద్దంటూ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.