Earthquake : ఉత్తర భారతదేశంలో భూకంపం అలజడి రేపింది. ఢిల్లీ సహా పలు ఉత్తరాధి రాష్ట్రాల్లో మంగళవారం రాత్రి భారీ భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.6గా నమోదైంది. అఫ్గానిస్తాన్లోని హిందూకుషిలో భూఉపరితలం నుంచి 180 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అఫ్గానిస్తాన్లోని ఫైజాబాద్కు ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
మంగళవారం రాత్రి 10.20 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పిల్లలతో కలిసి రోడ్లపైకి వచ్చేశారు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. హర్యానా, పంజాబ్, రాజస్తాన్, కశ్మీర్ రాష్ట్రాల్లో భూకంపనలు సంభవించాయి. జమ్మూలో కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల సేవలకు అంతరాయం ఏర్పడింది.
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ లో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ దేశాల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదైంది. పాకిస్తాన్లోని లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, జీలం, షేక్పురా, స్వాత్, ముల్తాన్, షాంగ్లా ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లో భూకంపం వల్ల గతంలో విషాదాలు చోటుచేసుకున్నాయి. 2005లో సంభవించిన భూకంపం దాటికి 74,000 మంది మృతిచెందారు.