MLC Kavitha : ఎలాంటి సంచలనాలు లేకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ మూడోసారి ముగిసింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవితను రాత్రి 9.40 గంటల వరకు అధికారులు ప్రశ్నించారు.
కవితను విచారిస్తున్న సమయంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ సోమా భరత్ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. కవిత విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు భరత్ను కార్యాలయానికి పిలిచారు. ఆమెకు సంబంధించిన ఆథరైజేషన్ సంతకాల కోసం పిలిచారని సమాచారం. తదుపరి విచారణలో అవసరమైతే కవితకు బదులుగా సోమా భరత్ని పంపించేందుకు, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అందజేసేందుకు భరత్కు అవకాశం కల్పించేందుకే పిలిపించినట్టు తెలుస్తోంది. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు కవిత తన పాత మొబైళ్లను మీడియా ఎదుట ప్రదర్శించారు. కవర్లలో వాటిని తీసుకెళ్తున్నట్లు చూపించారు. 10 మొబైళ్లను కవిత వినియోగించారని ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొన్న నేపథ్యంలో.. విచారణకు ఆమె తన పాత ఫోన్లను తీసుకెళ్లారు.
తాను ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని తెలుపుతూ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు కవిత లేఖ రాశారు. ఈడీ ఆరోపించిన తన 10 ఫోన్లను ఐఎంఈఐ నంబర్లతో సహా జమ చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఒక మహిళ స్వేచ్ఛకు భంగం కలిగించేలా తన మొబైల్ ఫోన్లను కోరారని.. అయినా తాను ఉపయోగించిన అన్ని ఫోన్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తునకు సంబంధించిన వాస్తవ విరుద్ధమైన అంశాలను మీడియాకు ఇస్తున్నారని లేఖలో కవిత ఆరోపించారు.
విచారణ జరుగుతున్న సమయంలో ఈడీ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించారు. ఉదయం నుంచే భారీగా బలగాలను మోహరించారు. కవిత అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలను దూరంగా పంపించేశారు.
వరుసగా రెండురోజుల పాటు 10-10 గంటల చొప్పున కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు.
సోమవారం కవిత బినామీగా భావిస్తున్న రామచంద్ర పిళ్లైను ఎదురుగా ఉంచి ప్రశ్నలు అడిగారు. సమీర్ అరోరా, మనీశ్ సిసోడియాల సమక్షంలోనూ విచారించారు. సోమవారం కవితను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగినా అలా జరగలేదు. మంగళవారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించడంతో అరెస్టుపై ఉత్కంఠ కొనసాగింది. మంగళవారం కూడా కవిత విచారణ సుదీర్ఘంగా సాగింది. కవిత అందజేసిన ఫోన్లలోని డేటా ఆధారంగా ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఫోన్లు ఎందుకు మార్చారని.. లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ ఎలా వచ్చిందని.. సౌత్ గ్రూప్ తరఫున 100 కోట్లు ముడుపులు ఇచ్చారా అని.. ఇండోస్పిరిట్లో మీ బినామీ రామచంద్ర పిళ్లైకి వాటాలు ఎలా వచ్చాయని.. ఇలా అనేక కోణాల్లో సమగ్రంగా విచారించారని సమాచారం. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. మరోసారి అరెస్ట్ చేయకుండానే కవితను ఈడీ పంపించింది.