BJP : అమెరికా పత్రిక వాల్స్ట్రీట్ జర్నల్ బీజేపీపై ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రచురించింది. అమెరికన్ల ప్రయోజనాల కోణంలో నుంచి చూస్తే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ బీజేపీ అని పేర్కొంది. భారత్ అత్యంత వేగంగా ఆర్థికశక్తిగా ఎదిగిందని తెలిపింది. ఇండో-పసిఫిక్ వ్యూహ రచనలో జపాన్తో సమానంగా అమెరికాతో కలిసి పనిచేస్తోందని వెల్లడించింది. చైనా శక్తిని సమతుల్యం చేయడానికి అమెరికా ప్రయత్నాలకు ఎవరి సాయం లేకుండానే బీజేపీ నుంచి కార్యాచరణ లభిస్తుందని వెల్లడించింది. భారత్ బయట బీజేపీను అర్థం చేసుకొన్న వారు చాలా తక్కువ మంది ఉన్నారని వివరించింది. విదేశాల్లో ఎక్కువ మందికి అవగాహన లేని రాజకీయ, సాంస్కృతిక చరిత్ర నుంచి కాషాయ పార్టీ ఎదిగిందని పేర్కొంది.
క్రిస్టియన్ మెజార్టీ ఉన్న ఈశాన్య భారత్లో బీజేపీ విజయాలను వాల్స్ట్రీట్ జర్నల్ తన కథనంలో ప్రస్తావించింది. 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో షియా ముస్లింల నుంచి మద్దతు బీజేపీకి లభిస్తోందని తెలిపింది. కుల వ్యవస్థలో వివక్షపై పోరాటానికి ఆర్ఎస్ఎస్ బలంగా పనిచేస్తోందని పేర్కొంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో సంబంధాలను అమెరికన్లు కాదనలేని పరిస్థితి నెలకొందని వాల్ స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది. చైనా వేగంగా ఎదుగుతున్న సమయంలో ఆర్థిక, రాజకీయ భాగస్వామ్య అవసరం అమెరికాకు చాలా ఉందని తేల్చిచెప్పింది. భారత్తో సుస్థిర సంబంధాల విషయంలో హిందూ జాతీయ భావాలను, ఉద్యమాన్ని అర్థం చేసుకోవడం వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులకు అవసరమని వాల్స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది.
ముస్లిం బ్రదర్హుడ్ మాదిరిగా బీజేపీ కూడా చాలా పశ్చిమ దేశాల ఉదారవాద ఆలోచనలను తిరస్కరిస్తుందని వాల్స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది. భారత్ ప్రపంచ శక్తిగా మారాలని బీజేపీ భావిస్తోందని వివరించింది. ఇజ్రాయెల్లోని లికుడ్ పార్టీలా మార్కెట్ అనుకూల విధానాలను అనుసరిస్తూనే.. మరోవైపు ప్రజాకర్షక పనులు, సంప్రాదాయ విలువలకు ప్రాధాన్యమిస్తుందని పేర్కొంది. కాస్మోపాలిటన్, పశ్చిమ దేశాల సంస్కృతి నుంచి దూరం పెట్టినట్లు భావించేవారి కోపాన్ని కూడా అనుకూలంగా మలుచుకుంటోందని తెలిపింది. ఇలా ఎన్నో విషయాలను వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో ప్రస్తావించింది.