Pharmacy industry: ప్రపంచ దేశాలు అన్ని చాలావరకు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. తమకు అందుబాటులో ఉన్న వనరులతోనే పరిశోధనలు చేపట్టడం, కొత్త ప్రయోగాలు చేయడం లాంటివి చేస్తున్నాయి. ఇలా చేస్తే ఇతర దేశాల నుండి వచ్చే దిగుమతి శాతం చాలావరకు తగ్గిపోతోంది. ప్రస్తుతం ఇండియా కూడా ఇదే దిశగా అడుగులు వేయనుంది.
గత కొతకాలంగా ఇండియాలోని ఫార్మసీ ఇండస్ట్రీ చాలా చురుగ్గా ముందుకు సాగుతోంది. ముందుగా మన దేశంలో మందులు కనిపెట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. కానీ మెటీరియల్స్ కోసం ఇప్పటికీ ఇండియా.. ఇతర అభివృద్ధి చెందిన దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. మందుల తయారీలో చురుగ్గా ఉన్నా కూడా మెటీరియల్స్ విషయంలో మాత్రం ఇండియా.. ఇతర దేశాలపై ఆధారపడక తప్పడం లేదు. ఇకపై అలా జరగకూడదని పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఇదే విషయాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్సైఆర్)తో చర్చించింది.
ఇతర దేశాల నుండి ఫార్మసీ ఇండస్ట్రీకి వస్తున్న దిగుమతి సంఖ్య తగ్గిపోవడానికి షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలని పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం మెటీరియల్స్ కోసం దాదాపు 80 శాతం ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది ఇండియా. ఈ శాతాన్ని వచ్చే అయిదేళ్లలో 30 నుండి 40 శాతం తగ్గించాలని టార్గెట్ పెట్టుకుంది. దీనికోసం ఒక మిషిన్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్లో మినిస్టర్లు, ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా భాగంకానున్నాయి.
మెటీరియల్స్ కోసం ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఉండాలంటే.. మనకు సరిపడా వనరులు ఉండాలి. అంతే కాకుండా ఆర్థికంగా ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండాలి. అందుకే ఫార్మిసీ ఇండస్ట్రీలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి కూడా ఈ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. దీనికోసం కొత్త కొత్త టెక్నాలజీలను, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) లాంటి ట్రెండింగ్ టెక్నాలజీలను ఉపయోగించాలని అనుకుంటున్నారు. అన్నింటి సాయంతో వారి టార్గెట్ పూర్తవ్వాలని పార్లమెంటరీ కమిటీ ఆశిస్తోంది.