Ugadi Day : శ్రీ కృష్ణునికి ఇష్టమైన రుతువు వసంత రుతువు. సృష్టి ప్రారంభమైన రోజు ఉగాది. అందుకే తెలుగు వాళ్లు ఉగాదిని సంవత్సరాదిగా జరుపుకుంటూ ఉండటం ఆచారంగా వస్తోంది. మన పూర్వీకులు ఆచరించిన పనుల్ని మనం కూడా ఆచరిస్తే మంచిది. అందులో దవనంతో దేవుడిని ఆరాధించటం, ధ్వజారోహణం, చత్ర చామర వితరణ, ప్రసాదాన ప్రారంభం మొదలైనవి. దవనం అంటే మరువం లాంటిది. దానితో దేవుడిని పూజించాలి. ఉగాది రోజు ఇంటి ముందు ఒక వెదురు కర్ర పాతి దానికి పసుపు రాసి కుంకుమతో అలంకరించాలి. దాని పై రాగి చెంబు పెట్టి పూవులతో పూజిస్తే చాలా మంచిది అని మన పెద్దలు చెప్పేవారు.
ఇలాంటి విశిష్టమైన రోజు మనకి తెలియకుండానే కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. పండుగ రోజంతా ఉంటుంది. కాబట్టి చేయాలనుకున్న పనులు ఏ సమయంలో అయినా చేయవచ్చు అనుకుంటారు. కానీ, అది సరైనది కాదు. మంచి సమయంలో మంచి పనులు చేస్తేనే కష్టాలు దరిచేరకుండా ఉంటాయి. బుధవారం ఉదయం గం. 6 నుండి 11 గం. లోపు ప్రతి ఒక్కరూ ఉగాది పూజను పూర్తి చేసుకోవాలి. ఆ సమయంలోనే ఉగాది పచ్చడిని కూడా చేసుకుని స్వీకరించాలి.
ఉగాది రోజున పడమర దిశకు ప్రయాణం చేయడం మంచిది. ఉదయం 6గంటల నుండి 11 గంటల వరకూ అలాగే మద్యాహ్నం 1:30 నిమిషాల నుండి సాయంత్రం 4.30 నిమిషాల సమయంలో ప్రయాణాలు శుభం కలిగిస్తాయని శాస్త్రం చెబుతోంది. అలాగే ఉత్తర దిశ ప్రయాణాలు కలిసిరావంటోంది శాస్త్రం.. కాబట్టి ఆ దిశవైపు ప్రయాణం చేయకండి. అలాగే ఉదయం 11 గంటల లోపు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఉత్తమం. ఉదయం పూజ సమయంలో లేదా మద్యాహ్నం 1:30 నిమిషాల నుండి సాయంత్రం గం.4.30 లోపు కాని అకౌంట్స్ పుస్తకాలు ప్రారంభించుకోవడం వల్ల అంతా శుభం జరుగుతుంది. వ్యాపారులు లాభాలు కూడా పొందొచ్చు. ఏదైనా కారణంతో ఆలస్యంగా పైన చెప్పిన సమయాలలో పనులు చేయకుంటే భగవంతుడిపై భారంవేసి సత్ సంకల్పంతో ఏ సమయంలోనైనా సరే శుచి, శుభ్రతతో పనులు ప్రారంభించండి.