Stock Market: సోమవారం భారత మార్కెట్లు కుప్పకూలాయి. భారీ పతనాన్ని చవిచూశాయి. నిఫ్టీ ఒకదశలో 250 పాయింట్లు పడిపోయింది. సెన్సెక్స్ 900 పాయింట్లు డౌన్ అయింది. చివర్లో సూచీలు కాస్త కోలుకున్నాయి. నిఫ్టీ 111.65 పాయింట్లు నష్టపోయి 16,988.40 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 360.95 పాయింట్ల నష్టంతో 57,628.95 దగ్గర క్లోజ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. బ్యాంకింగ్ సంక్షోభ పరిణామాలు మార్కెట్లను వెంటాడాయి. ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంక్, క్రెడిట్ సూయిజ్ వంటి బ్యాంకులు దివాళా స్థితికి చేరడం మదుపర్లను కలవరపెట్టింది. ఈ వారం ఫెడ్ సమావేశం ఉండటంతో మదుపర్లు ముందుజాగ్రత్తగా షేర్లు అమ్మేసుకున్నారు.
అమెరికా ఫెడరల్ రిజర్వు ఈ వారంలో సమావేశం కానుంది. వడ్డీరేట్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్యాంకింగ్ రంగ సంక్షోభంతో ఫెడ్ రేట్ల పెంపును తాత్కాలికంగా తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రిలయన్స్, విప్రో, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, జుబిలంట్ ఫుడ్ వర్క్స్, లారస్ ల్యాబ్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, ఎంఫసిస్, మ్యాక్స్ ఫైనాన్షియల్, ఇమామి షేర్లు 52 వారాల కనిష్ఠాన్ని తాకాయి.
అదానీ గ్రూపు కంపెనీలు మళ్లీ పతనం అవుతున్నాయి. అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్.. లోయర్ సర్క్యూట్ని తాకాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ మినహా మిగిలిన అదానీ షేర్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి.