Amritpal: ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ దేశం విడిచి పారిపోయేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడు నేపాల్ మీదుగా కెనడా పారిపోయే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వారిస్ పంజాబ్ దే నేత కోసం భద్రతా దళాలు పంజాబ్ను జల్లెడ పడుతున్నాయి. గతంలో చాలా కాలం దుబాయ్లో ఉన్న అమృత్పాల్కు.. అక్కడే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISIతో పరిచయాలు ఏర్పడ్డాయి. అతడిని పావుగా వాడుకొని పంజాబ్లో కల్లోలం సృష్టించడానికి పథకం పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
అమృత్పాల్ చరిత్ర తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. అమృత్పాల్ 2012లో ట్రక్ డ్రైవర్గా పనిచేసేందుకు దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఖలిస్థాన్ నేతలతో పరిచయం ఏర్పడింది. దుబాయ్లో అతడికి ISI బ్రెయిన్ వాష్ చేసింది. ఆ తర్వాత భారత్ చేరుకోవడానికి ముందు అమృత్పాల్ జార్జియాకు వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అతడికి అక్కడే ISI ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. అతడు పంజాబ్లో అల్లర్లు సృష్టించడానికి పక్కా వ్యూహాంతోనే దేశంలో అడుగుపెట్టాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత వారిస్ పంజాబ్ దేను హైజాక్ చేశాడు. అక్కడి నుంచి అమృత్పాల్ మెరుపువేగంతో ఎదిగాడు.
అమృత్పాల్కు సిక్ ఫర్ జస్టిస్ సంస్థతో కూడా సంబంధాలున్నాయి. పాకిస్థాన్ నుంచి తరచూ పంజాబ్లోకి చొరబడే డ్రోన్ల ద్వారా… అమృత్పాల్కు అవసరమైన ఆయుధాలు వచ్చినట్లు అనుమానాలున్నాయి. అమృత్పాల్కు యూకేలో ఉంటున్న అవతార్ సింగ్ ఖండా ప్రధాన హ్యాండిలర్గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. అవతార్ సింగ్, పమ్మాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. 2022 ఫిబ్రవరి వరకు అనామకుడిగా ఉన్న అమృత్పాల్ ఎదుగుదల వెనుక అవతార్ ప్లాన్లు ఉన్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. గతంలో అమృత్పాల్ కనీసం తలపాగా కూడా ధరించేవాడు కాదు. యాక్టర్ దీప్సిద్ధూ మరణంతో అమృత్పాల్ జీవితమే మారిపోయింది. ‘వారిస్ పంజాబ్ దే’కు తానే నాయకుడినని ప్రకటించుకున్నాడు.
ఖలిస్థాన్ ఉద్యమానికి విదేశాల నుంచే నిధులు వస్తున్నాయి. పంజాబ్లో కొందర్ని అడ్డుపెట్టుకుని… విదేశాల్లోని కొందరు సిక్కులు ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఖలీస్థాన్ పేరుతో భారత్లో అల్లకల్లోలం సృష్టించేందుకు ISIతో పాటు విదేశాల్లోని కొన్ని దుష్టశక్తులు కుట్రలకు తెరలేపాయి. ఈ క్రమంలో ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఖలిస్థానీ మద్దతుదారులు కొంతకాలంగా కెనడా, బ్రిటన్లలోని హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తూ విధ్వంసానికి దిగుతున్నారు. ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులతో ఘర్షణలకు దిగుతున్నారు. ఈ ఉద్యమాన్ని నడిపించేందుకు పాకిస్థాన్కు చెందిన ISI ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, యూరోపియన్ దేశాల నుంచి పనిచేస్తున్న ఇతర తీవ్రవాద భావజాల మూకలు ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యమాన్ని ఎగదోస్తూ ఆర్థిక సహాయం అందిస్తున్నాయి.
ఇదిలా ఉండగా అమృత్పాల్ బాబాయ్ హర్జీత్సింగ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అమృత్ పాల్ డ్రైవర్ హర్ప్రీత్ సింగ్ లొంగిపోయాడు. ఇప్పటివరకు 112 మంది అమృత్పాల్ అనుచరులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు పంజాబ్లో ఇంటర్నెట్పై ఆంక్షలను మరో 24 గంటలు పొడగించింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్నెట్ పై సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. వైద్య, బ్యాంకింగ్ అవసరాల కోసం బ్రాడ్బ్యాండ్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
మరోవైపు దేశ సరిహద్దుల వద్ద తనిఖీలు, భద్రతను పటిష్ఠం చేయాలని కేంద్ర హోంశాఖ BSFను ఆదేశించింది. అమృత్పాల్ నేపాల్ వద్ద అంతర్జాతీయ సరిహద్దులు దాటే అవకాశం ఉండటంతో నిర్ణయం తీసుకొంది.